చిదంబరాన్ని మా కస్టడీకి ఇవ్వండి: కోర్టును ఆశ్రయించిన ఈడీ
న్యూఢిల్లీ: ఐఎన్ఎక్స్ మీడియా కేసులో చిదంబరాన్ని తమ కస్టడీకి అప్పగించాలంటూ ఢిల్లీలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానాన్ని ఆశ్రయించింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ). కాగా, ఇదే కేసులో చిదంబరం ప్రస్తుతం జుడీషియల్ కస్టడీలో ఉన్నారు.
ఐఎన్ఎక్స్ మీడియా కేస్ అప్డేట్స్: బెయిల్ కోసం సుప్రీం తలపులు తట్టిన చిదంబరం
ఆగస్టు నెలలో చిదంబరాన్ని సీబీఐ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. సెప్టెంబర్ 5 నుంచి ఆయన తీహార్ జైలులో ఉంటున్నారు. అక్టోబర్ 17 వరకు జైలులోనే ఉండాలని ప్రత్యేక న్యాయస్థానం ఇటీవల తీర్పు వెలువరించింది.
చిదంబరం ఆర్థిక మంత్రిగా ఉన్న సమయంలో ఐఎన్ఎక్స్ మీడియా సంస్థలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల మంజూరు కోసం విదేశీ పెట్టుబడుల బోర్డు(ఎఫ్ఐపీబీ)లో నిబంధనలు అతిక్రమించి, అవకతవకలు జరిపారన్న ఆరోపణలపై కేసు నమోదైంది. రూ. 305 కోట్ల విదేశీ పెట్టుబడులు మీడియా సంస్థలోకి అక్రమంగా వచ్చేలా చిదంబరం వ్యవహారాన్ని చక్కబెట్టారన్న ఆరోపణలపై సీబీఐ చిదంబరంపై 2017లో మనీలాండరింగ్ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.
ఈ కేసును సీబీఐతోపాటు ఈడీ కూడా విచారిస్తోంది. ఇక ఐఎన్ఎస్ మీడియా వ్యవస్థాపకురాలైన ఇంద్రాణి ముఖర్జియా, ఆమె భర్త పీటర్ ఇద్దరూ కూడా అప్రూవర్గా మారి ఈ కేసులో చిదంబరానికి వ్యతిరేకంగా వాంగ్మూలం ఇచ్చారు.
కాగా, చిదంబరం బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అయితే, ఆయనకు మాత్రం ప్రతికూల ఫలితాలే వస్తున్నాయి. ఇటీవల బెయిల్ మంజూరు చేసే విషయంలో చిదంబరానికి సుప్రీంకోర్టులోనూ ఎదురు దెబ్బే తగిలింది. చిదంబరానికి బెయిల్ మంజూరు చేయాలని దీనికి సంబంధించిన పిటీషన్ పై వెంటనే విచారణ (అర్జంట్ లిస్టింగ్) చేపట్టాలంటూ కపిల్ సిబల్ దాఖలు చేసిన విజ్ఞప్తిని సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణకు స్వీకరించింది.
న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలో న్యాయమూర్తులు జస్టిస్ సంజీవ్ ఖన్నా, కృష్ణ మురారిలతో కూడిన ముగ్గురు జడ్జీల ధర్మాసనం విచారణకు తీసుకుంది. ఆ వెంటనే ఈ పిటీషన్ ను ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగొయ్ పరిశీలనకు పంపించింది.