ఐఎన్ఎక్స్ మీడియా కేసు: కీలక విచారణాధికారిని బదిలీ చేసిన ఈడీ
న్యూఢిల్లీ: ఐఎన్ఎక్స్ మీడియా కేసు విచారణలో భాగంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) సంచలన నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర ఆర్థికమంత్రి చిదంబరం ఐఎన్ఎక్స్ మీడియా కేసులో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.
అయితే, తొలి నుంచి ఈ కేసును విచారిస్తున్న ఈడీ అధికారి రాకేష్ అహుజాను ఈడీ బదిలీ చేసింది. చిదంబరంను కస్టడీకి తీసుకోవడంలో రాకేష్ కీలక పాత్ర పోషించడం గమనార్హం. ఢిల్లీ పోలీసు విభాగానికి అధికారిగా రాకేష్ అహుజాను పంపిస్తున్నట్లు గురువారం అర్ధరాత్రి ఈడీ ఓ ప్రకటనలో వెల్లడించింది.
ప్రస్తుతం రాకేష్ ఈడీలో అసిస్టెంట్ డైరెక్టర్ విధులు నిర్వహిస్తున్నారు. ఢిల్లీ హైకోర్టు ముందస్తు బెయిల్కు నిరాకరించడంతో బుధవారం రాత్రి చిదంబరంను సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే.
గురువారం చిదంబరంను సీబీఐ కోర్టులో ప్రవేశపెట్టగా.. నాలుగు రోజులపాటు కస్టడీ విధించింది. దీంతో సీబీఐ అధికారులు చిదంబరం నుంచి ఐఎన్ఎక్స్ మీడియా కేసుకు సంబంధించిన వివరాలను రాబడుతున్నారు.
ఇది ఇలా ఉండగా, చిదంబరం ముందస్తు బెయిల్ పిటిషన్పై సుప్రీంకోర్టులో శుక్రవారం వాదనలు జరిగాయి. సీబీఐ కోర్టు నాలుగు రోజులపాటు కస్టడీకి ఇవ్వడంతో ఆగస్టు 26 వరకు చిదంబరంను సీబీఐ విచారించనుంది.