తీహార్ జైలులోనే చిదంబరం: వచ్చేనెల 3 వరకూ కస్టడీ పొడిగింపు: బెయిల్ కు నో!
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, కేంద్ర, ఆర్థిక, హోం శాఖల మాజీమంత్రి పీ చిదంబరానికి గురువారం మరోసారి ఎదురు దెబ్బ తగిలింది. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో అరెస్టయిన ఆయన కస్టడీని పొడిగించింది ఢిల్లీ న్యాయస్థానం. చిదంబరాన్ని మరి కొద్దిరోజుల పాటు విచారించాల్సి ఉందని, కస్టడీని పొడిగించాలని కోరుతూ సీబీఐ దాఖలు చేసిన పిటీషన్ ను ఢిల్లీ న్యాయస్థానం పరిశీలనలోకి తీసుకుంది. ఆయన కస్టడీని పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. విచారణ సందర్భంగా ఆయనను తీహార్ జైలులోనే ఉంచాలని సూచించింది. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో చిదంబరాన్ని సీబీఐ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసు విచారణ కొద్దిరోజుల పాటు ఢిల్లీలోని సీబీఐ ప్రధాన కార్యాలయంలో కొనసాగింది. అనంతరం ఆయనను తీహార్ జైలుకు పంపించాలని న్యాయస్థానం ఆదేశించింది.
కస్టడీకి పొడిగింపునకు ఓకే
ఈ నెల 5వ తేదీ నుంచి చిదంబరం.. తీహార్ జైలులోని ఏడో నంబర్ క్లాంప్లెక్స్ కారాగారంలో ఉంటున్నారు. గురువారం నాటికి ఆయన కస్టడీ ముగిసింది. దీనితో సీబీఐ అధికారులు ఆయనను ఈ మధ్యాహ్నం న్యాయస్థానం ముందు హాజరు పరిచారు. ఆ వెంటనే సీబీఐ తరఫు న్యాయవాది, సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా.. చిదంబరం కస్టడీని పొడిగించాలని కోరుతూ పిటీషన్ ను దాఖలు చేశారు. దీన్ని విచారణకు స్వీకరించారు న్యాయమూర్తులు. చిదంబరం తరఫున పార్టీ సహచన నాయకుడు, కేంద్ర మాజీమంత్రి కపిల్ సిబల్ వాదించారు. చిదంబరం వయస్సును దృష్టిలో ఉంచుకుని ఆయనకు బెయిల్ ఇవ్వాలని కోరారు. చిదంబరాన్ని విచారించడంలో సీబీఐ అధికారులు ఎలాంటి పురోగతిని సాధించలేకపోయారని అన్నారు. సీబీఐ నమోదు చేసిన కేసులో ఎలాంటి పస లేదని వాదించారు.
అధికారులు అరెస్టు కాలేదెందుకు?
ఐఎన్ఎక్స్ మీడియా కేసులో విదేశీ పెట్టుబడులను ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక మండలి అధికారులు రూపొందించిన ఫైలుపై చిదంబరం సంతకం మాత్రమే చేశారని, ఈ ఫైలును రూపొందించిన అధికారులు ఎవ్వరూ ఇంతవరకూ అరెస్టు కాకపోవడం.. కేసు వెనుక గల కారణాలేమిటో అర్థమౌతున్నాయని కపిల్ సిబల్ వాదించారు. రాజకీయ కారణాలతో చిదంబరాన్ని జైలుపాలు చేశారని అన్నారు. ఆయన వాదనలను సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తప్పుపట్టారు. విచారణ ప్రస్తుతం కీలక దశకు చేరుకుందని ఇలాంటి సమయంలో బెయిల్ ఇవ్వడం గానీ, కస్టడీని ముగించడం గానీ చేయడం సరికాదని అన్నారు. మరి కొన్నాళ్ల పాటు కస్టడీని పొడిగించడానికి అనుమతి ఇవ్వాలని కోరారు. దీనిపై విచారించిన అనంతరం- వచ్చేనెల 3వ తేదీ వరకు కస్టడీని పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేశారు.
అనారోగ్య కారణాలను దృష్టిలో ఉంచుకోవాలని కోరినా..
చిదంబరం వయస్సు, అనారోగ్య కారణాలను దృష్టిలో ఉంచుకుని బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ చిదంబరం తరఫు న్యాయవాది కపిల్ సిబల్ దరఖాస్తును దాఖలు చేశారు. విచారణ కొనసాగిన కాలంలో చిదంబరం ఆరోగ్యం క్షీణించిందని, ఆయన గణనీయంగా బరువు తగ్గారని అన్నారు. అధిక రక్తపోటు, మధుమేహంతో పాటు కంటి చూపు సైతం మందగించిందని అన్నారు. జైలులో ప్రతిరోజూ క్రమం తప్పకుండా ఆరోగ్యాన్ని పరీక్షించుకోవడానికైనా అవకాశం కల్పించాలని కోరారు. కాగా- బెయిల్ కోసం చిదంబరం దాఖలు చేసుకున్న మరో పిటీషన్ ధర్మాసనం ముందుకు ఇంకా విచారణకు రాలేదు. ఈ నెల 23వ తేదీన బెయిల్ పిటీషన్ పై న్యాయమూర్తులు విచారణ చేపట్టనున్నారు. కస్టడీ కొనసాగినంత కాలం కుటుంబ సభ్యులు గానీ, స్నేహితులు గానీ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు గానీ చిదంబరాన్ని కలుసుకునే వెసలుబాటును కల్పించింది ఢిల్లీ న్యాయస్థానం.