‘అమ్మ’ అభివృద్ది చూడండి: ఐప్యాడ్ తో ప్రచారం
చెన్నై: తమిళనాడులో ఉప ఎన్నికలు ప్రచారం ఊపందుకుంది. తమిళనాడులో అధికారంలో ఉన్న అన్నాడీఎంకే నాయకులు ఇప్పుడు జరుగుతున్న ఉప ఎన్నికల్లో హై టెక్ ప్రచారం చేస్తున్నారు.
జయలలిత రెండో సారి సీఎం అయిన తరువాత చేపట్టిన పలు అభివృద్ది పనుల వివరాలను ప్రజల ముందుకు తీసుకు వెళ్లి క్షుణ్ణంగా వివరిస్తున్నారు. ఎలాగైనా మూడు శాసన సభ నియోజక వర్గాల ఉప ఎన్నికల్లో గెలువాలని అన్నాడీఎంకే అభ్యర్థులు ఇలాంటి ప్రచారం ముమ్మరం చేస్తున్నారు.
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. తమిళనాడులోని తంజావూరు, అరవకురిచి, తిరుపరాకుందం నియెజక వర్గాల్లో ఈ నెల 19వ తేదిన ఉప ఎన్నికలకు పోలింగ్ నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
ఈ నేపధ్యంలో అన్నాడీఎంకే నాయకులు హైటెక్ ఐ ప్యాడ్స్ తీసుకుని అందులో జయలలిత సీఎం అయిన తరువాత పేద ప్రజలకు ప్రవేశపెట్టిన అనేక పథకాలు, పూర్తి చేసిన అభివృద్ది పనుల వివరాలను ఐ ప్యాడ్ లో పెట్టి ప్రజల దగ్గరకు తీసుకు వెలుతున్నారు.
అమ్మ పేదల కోసం ఇలాంటి అభివృద్ది పనులు చేశారని గడపగడపకు వెళ్లి ప్రచారం చేస్తున్నారు. అమ్మ చేపట్టిన అభివృద్ది పనుల పూర్తి వివరాలను ఐ ప్యాడ్ లలో ప్రజలకు చూపిస్తున్నారు. అన్నాడీఎంకే చరిత్రలో ఇలాంటి హైటెక్ ప్రచారం ఇప్పటి వరకు ఎన్నడూ చెయ్యలేదని పార్టీ కార్యకర్తలు అంటున్నారు.
జయలలిత ఆసుపత్రి నుంచి ఇంటికి చేరుకున్న తరువాత ఆమెకు ఈ మూడు నియోజక వర్గాల ఉప ఎన్నికల విజయాన్ని బహుమతిగా ఇవ్వాలని అన్నాడీఎంకే నాయకులు నిర్ణయించారు. అన్నాడీఎంకే ఐటీ వింగ్ ప్రధాన కార్యదర్శి రామచంద్రన్ ఈ వివరాలు మీడియాకు వెల్లడించారు.
అమ్మ చేపట్టిన అభివృద్ది పనులు, పలు పథకాల పూర్తి సమాచారాన్ని ప్రజల దగ్గరకు తీసుకు వెలుతున్నామని అన్నారు. అమ్మ చేపట్టిన అభివృద్ది పనుల వివరాలను వీడియో రూపంలో ప్రజల ముందుకు తీసుకు వెళ్లి వివరించి వారికి ఇంకా దగ్గర కావాలని నిర్ణయం తీసుకున్నామని రామచంద్రన్ అన్నారు.
అదే విధంగా ప్రజల అభిప్రాయాలను మేము ఐ ప్యాడ్ లో పొందుపరుస్తున్నామని, తప్పకుండా మూడు నియోజక వర్గాల్లో అన్నాడీఎంకే అభ్యర్థులు విజయం సాధిస్తారని ఏఐఏడీఎంకే ఐటీ విభాగం ప్రధాన కార్యదర్శి రామచంద్రన్ జోస్యం చెప్పారు.