ఐపీఎల్కు కేంద్రం గ్రీన్ సిగ్నల్: యూఏఈలో తొలి మ్యాచ్ సెప్టెంబర్ 19న, ఫైనల్ నవంబర్ 10
న్యూఢిల్లీ: క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)కు రంగం సిద్ధమైంది. 13వ ఐపీఎల్ సీజన్ నిర్వహించేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) చేసిన విజ్ఞప్తికి కేంద్రం పచ్చజెండా ఊపింది. దీంతో త్వరలోనే ఐపీఎల్ ప్రారంభం కానుంది.
సెప్టెంబర్ 19 నుంచి నవంబర్ 10 వరకు యూఏఈ వేదికగా ఐపీఎల్ నిర్వహణకు కేంద్రం అనుమతి ఇవ్వడంతో బీసీసీఐ ఇక తన పనులు మొదలుపెట్టింది. ఐపీఎల్ నిర్వహణకు కేంద్రం నుంచి అనుమతుల కోసం బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ చేసిన ప్రయత్నాలు చివరకు ఫలించడంతో ఇక క్రికెట్ అభిమానులకు పండగ మొదలుకానుంది.
కాగా, తొలిపోరు సెప్టెంబర్ 19న ప్రారంభం కానుండగా, ఫైనల్ మ్యాచ్ నవంబర్ 10న జరగనుంది. ఐపీఎల్ నిర్వహణకు సంబంధించి ఆదివారం జరిగిన పాలక మండలి భేటీలో సభ్యులు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. అబుదాబి, దుబాయ్, షార్జాలలో 51 రోజులపాటు మ్యాచ్ లు నిర్వహించనున్నట్లు బీసీసీఐ తెలిపింది.
చైనా కంపెనీలతో సహా అన్ని స్పాన్సర్లకు ఐపీఎల్ పాలక మండలి అనుమతించింది. సాయంత్రం జరిగే మ్యాచ్ లు ఎప్పటిలా 7 గంటలకు కాకుండా 7.30గంటలకు ప్రారంభం కానున్నాయి. మధ్యాహ్నం జరిగే మ్యాచ్లు 3.30 గంటలకు ప్రారంభమవుతాయని సమావేశం నిర్ణయించింది.
ఐపీఎల్ నిర్వహణకు సంబంధించి అనుసరించాల్సిన విధి విధానాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించేందుకు త్వరలోనే పాలక మండలి మరోసారి భేటీ కానుంది. ఇందులో ముఖ్యంగా కరోనా క్వారంటైన్ నిబంధనలు అనుసరించి బయో బబుల్ శిక్షణ కార్యక్రమాలు, ఆటగాళ్ల వసతి, ప్రయాణాలపై చర్చించనున్నారు.
అలానే మహిళల ఐపీఎల్ కూడా నిర్వహించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. కాగా, ఐపీఎల్ విదేశీ గట్టపై జరగడం ఇదే తొలిసారి కాదు. దేశంలో సార్వత్రిక ఎన్నికల కారణంగా రెండు సార్లు విదేశాల్లోనే జరిగాయి. 2009లో పూర్తిగా దక్షిణాఫ్రికాలో జరగగా, 2014లో పాక్షికంగా యూఏఈలో ఐపీఎల్ మ్యాచ్లు జరిగిన విషయం తెలిసిందే.