IPL 2020: మరికొద్ది గంటల్లో ఐపీఎల్ తొలి మ్యాచ్, ధోనీ వర్సెస్ రోహిత్, అభిమానుల ఆత్రుత
న్యూఢిల్లీ: క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) టీ20 మరికొద్ది గంటల్లో ప్రారంభం కాబోతోంది. తొలి మ్యాచ్ ఫేవరేట్ జట్లయిన చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్కు మధ్య జరగనుంది. ముంబై జట్టుకు రోహిత్ శర్మ సారథ్యం వహిస్తుండగా.. చెన్నైకి మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్గా ఉన్నాడు. దీంతో తొలి మ్యాచ్ కోసం అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.
Recommended Video
సమయం ఆసన్నమైంది..
ఈ సందర్భంగా రోహిత్ శర్మ మాట్లాడుతూ.. అతిపెద్ద టీ20 క్రికెట్ లీగ్కు ముంబై ఇండియన్స్ సిద్ధంగా ఉందని, ఇక బరిలో దిగడమే తరువాయని అన్నాడు. ఈ మేరకు సోషల్ మీడియాలో పంచుకున్నారు. తమ ప్రాక్టీస్ ముగిసిందని, ఇక చెన్నైతో తొలి మ్యాచ్లో తలపడేందుకు సమయం ఆసన్నమైందని తెలిపాడు. ఇక మునుపటిలాగే తాను ఓపెనింగ్ బ్యాట్స్మన్గా దిగుతానని, అలాగే జట్టు అవసరాలను బట్టి ఏ స్థానంలోనైనా ఆడేందుకు సిద్ధంగా ఉన్నానని రోహత్ చెప్పాడు. అయితే, టాప్ ఆర్డర్లో ఆడటం తనకు ఇష్టమని పేర్కొన్నాడు.
ధోనీ చెన్నై విజయాల పరంపర..
ఇక చెన్నై సూపర్ కింగ్స్ కూడా తొలి మ్యాచ్ కోసం సిద్ధంగా ఉంది. ఐపీఎల్ టోర్నీలో ధోనీ నాయకత్వంలో చెన్నై జట్టు అత్యధిక విజయాలను సాధించిన విషయం తెలిసిందే. 174 మ్యాచ్లు ఆడితే.. అందులో 104 సార్లు విజయాలు నమోదు చేయడం గమనార్హం. ఐపీఎల్ చరిత్రలో వందకుపైగా విజయాలను సాధించిన జట్టు చెన్నై సూపర్ కింగ్సే కావడం గమనార్హం. మూడుసార్లు టోర్నీని సొంతం చేసుకుంది.
రోహిత్ ముంబై తక్కువేం కాదు..
ముంబై ఇండియన్స్ జట్టు కూడా తక్కువేం కాదు.. ఇప్పటి వరకు నాలుగుసార్లు ఐపీఎల్ టోర్నీని సొంతం చేసుకుంది. తొలి మ్యాచ్ కోసం ఇరు జట్లు కూడా సిద్ధంగా ఉన్నాయి. టోర్నీలో తొలి గెలుపు కోసం ఇరు జట్లు కూడా తీవ్రంగా శ్రమించే అవకాశాలు లేకపోలేదు. దీంతో మ్యాచ్ కూడా ఉత్కంఠగా సాగే అవకాశం ఉంది. ఈ మ్యాచ్ శనివారం రాత్రి 7.30గంటలకు ప్రారంభం కానుంది. కరోనా మహమ్మారి కారణంగా ఐపీఎల్ 2020ని యూఏఈలో నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే అన్ని జట్ల ఆటగాళ్లు కూడా యూఏఈ చేరుకున్నారు.