టీమిండియా క్రికెటర్తో ఢిల్లీ నర్సుకు ఏం పని? డాక్టర్గా పరిచయం: బీసీసీఐ వద్ద కీలక రిపోర్ట్
న్యూఢిల్లీ: భారత క్రికెట్ జట్టు మీద మరోసారి మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. టీమిండియాలో ఆడే ఓ కీలక ఆటగాడికి ఢిల్లీకి చెందిన ఓ నర్సు ఆన్లైన్ ద్వారా బెట్టింగ్ వల విసిరినట్లు తేలింది. దీనికి సంబంధించిన కొన్ని కీలక సాక్ష్యాధారాలు భారతీయ క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ)కు అందాయి. దీనిపై బీసీసీఐకి చెందిన అవినీతి నిరోధక విభాగం (ఏసీయూ) దర్యాప్తు చేపట్టింది. వారిద్దరి మధ్య నడిచిన ఆన్లైన్ ఛాటింగ్ డేటా వివరాలను సేకరించింది. ఆ క్రికెటర్ నుంచి వివరణ సైతం తీసుకుంది.
టీమిండియా క్రికెటర్తో ఆన్లైన్ ఛాటింగ్..
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ ఉదంతం క్రికెట్ అభిమానులను నివ్వెర పరుస్తోంది. ఐపీఎల్ 2020 సీజన్ 13వ ఎడిషన్ సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకున్నట్లు బీసీసీఐ నిర్ధారించింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా గత ఏడాది ముగిసిన ఐపీఎల్ 2020 సీజన్లో హిట్మ్యాన్ రోహిత్ శర్మ సారథ్యంలోని ముంబై ఇండియన్స్ టీమ్.. ఛాంపియన్గా ఆవిర్భవించిన విషయం తెలిసిందే. ఈ సీజన్ లీగ్ మ్యాచ్లు కొనసాగుతోన్న సమయంలో ఢిల్లీకి చెందిన నర్సు ఒకరు రహస్యంగా ఓ క్రికెటర్తో ఆన్లైన్ ఛాటింగ్ చేస్తూ.. కొంత కీలక సమాచారాన్ని సేకరించడానికి ప్రయత్నించినట్లు బీసీసీఐ ధృవీకరించింది.
సెప్టెంబర్ 30 నాటి మ్యాచ్..
ఆ క్రికెటర్.. రెండేళ్లుగా టీమిండియాకు ఆడుతున్నట్లు తెలుస్తోంది. కీలక సమాచారాన్ని సేకరించడానికి ఢిల్లీకి చెందిన ఆ నర్సు.. తనను తాను డాక్టర్గా చెప్పుకొని గత ఏడాది సెప్టెంబర్ 30వ తేదీన టీమిండియా క్రికెటర్ను ఆన్లైన్ ఛాటింగ్ ద్వారా కలిశారనే సాక్ష్యాధారాలను బీసీసీఐ సేకరించిందని, దానిపై విచారణకు అవినీతి నిరోధక విభాగానికి ఆదేశంచినట్లు జాతీయ మీడియా స్పష్టం చేసింది. ఆ నర్సు మూడేళ్ల కిందటే ఆన్లైన్ ద్వారా సదరు క్రికెటర్తో పరిచయం పెంచుకున్నట్లు తేలింది.
డాక్టర్గా పరియం..
నర్సు అయినప్పటికీ.. దక్షిణ ఢిల్లీలోని ఓ టాప్ ఆసుపత్రిలో డాక్టర్గా పనిచేస్తున్నట్లు ఆమె తనను తాను పరిచయం చేసుకున్నారని, అభిమానిగా చెప్పుకొన్నారని బీసీసీఐ గుర్తించింది. ఐపీఎల్లో బెట్టింగ్ చేయాలని నిర్ణయించుకున్నానని, జట్టుకు సంబంధించిన కొంత కీలక సమాచారాన్ని తనకు అందజేయాలని కోరగా.. ఆ క్రికెటర్ యాంగ్రీ ఎమోజీని ఆమెకు పంపించినట్లు బీసీసీఐ గుర్తించింది. దీనికి ఆమె శాడ్ ఎమోజీని రిప్లయ్ చేశారని నిర్ధారించింది. ఆ తరువాత కూడా వారిద్దరి మధ్య తరచూ ఆన్లైన్ ద్వారా ఛాటింగ్ కొనసాగినట్లు బీసీసీఐ అభిప్రాయపడింది.
క్రికెటర్ వివరణతో
కరోనా వైరస్ బారిన పడకుండా ఉండటానికి చిట్కాలను తెలియజేయాలంటూ ఆ క్రికెటర్.. ఆ నర్సును సంప్రదించినట్లు బీసీసీఐ ఏసీయూ చీఫ్ అజిత్ సింగ్ తెలిపారు. దీనిపై తాము రాతపూరకంగా ఆ క్రికెటర్ నుంచి వివరణ కోరామని తెలిపారు. ఆ క్రికెటర్ సంతృప్తికరమైన వివరణ ఇవ్వడంతో ఈ కేసు క్లోజ్ చేసినట్లు పేర్కొన్నారు. ఇకముందు ఇలాంటి పరిణామాలు తలెత్తకుండా ఉండటానికి బీసీసీఐ ఉన్నతాధికారులకు తాము కొన్ని సిఫారసులను చేసినట్లు అజిత్ సింగ్ పేర్కొన్నారు.