క్రికెటరే బెట్టింగులకు పాల్పడితే: ఐసీఎల్ ముంబై ఛాంప్ ప్లేయర్: ఐపీఎల్ ఫైనల్ టార్గెట్గా
ముంబై: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా ముగింపుదశకు చేరుకున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్-2020 సీజన్పై భారీగా బెట్టింగులు తెగుతున్నాయి. ఐపీఎల్-2020 ఫైనల్ మ్యాచ్పై అంచనాలకు మించిన స్థాయిలో బెట్టింగులు పెడుతున్నారు గ్యాంబ్లర్లు. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదిగా మంగళవారం సాయంత్రం ఫైనల్ మ్యాచ్ ఆరంభం కావాల్సి ఉండగా..కోట్ల రూపాయల మేర బెట్టింగుల రూపంలో చేతులు మారుతున్నాయి. ఆన్లైన్, ఫోన్ల ద్వారా భారీ బెట్టింగుల లావాదేవీలు నడుస్తున్నాయి.
తాజాగా- బెట్టింగ్ రాకెట్ల స్థావరాలపై ముంబై పోలీసులు దాడులు నిర్వహించారు. పలువురిని అరెస్టు చేశారు. ఇందులో ఫస్ట్క్లాస్ మాజీ క్రికెటర్ ఉండటం పోలీసులనలు నివ్వెరపరిచింది. ఆ క్రికెటర్ పేరు- రాబిన్ మోరిస్. ముంబై, ఒడిశా జట్ల తరఫున ఫస్ట్క్లాస్ మ్యాచ్లల్లో ఆడాడు. 44 సంవత్సరాల రాబిన్ మోరిస్ కెనడాలో జన్మించారు. భారత్లో స్థిరపడ్డారు. 42 ఫస్ట్క్లాస్ క్రికెట్ మ్యాచ్లను ఆడాడు. అండర్-19 జాతీయ జట్టు సభ్యుడు కూడా. 1995-96 మధ్యకాలంలో దక్షిణాఫ్రికాలో పర్యటించిన అండర్-19 జాతీయ క్రికెట్ జట్టు సభ్యుడతను.
ఎమిరేట్స్లో నడుస్తోన్న ఐపీఎల్-2020 మ్యాచ్లపై రాబిన్ మోరిస్ పెద్ద ఎత్తున బెట్టింగులను నిర్వహిస్తున్నట్లు పక్కా సమాచారం అందడంతో ముంబైలోని వెర్సోవా పోలీసులు అప్రమత్తం అయ్యారు. వెర్సోవాలోని యారీ రోడ్లో ఉన్న ఆయన ఫ్లాట్ సహా ఇతర కార్యాలయాలపై ఏకకాలంలో దాడులు చేశారు. ల్యాప్టాప్స్, సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. రాబిన్ సహా ముగ్గురిని అరెస్టు చేశారు. వారిపై ఐపీసీ, గ్యాంబ్లింగ్ నిరోధక చట్టం కింద అరెస్టు చేశారు. న్యాయస్థానం ముందు హాజరు పర్చారు.
ఇదివరకు ఆయనపై క్రిమినల్ కేసులు కూడా నమోదై ఉన్నాయి. శ్యామ్ తల్రోజా అనే లోన్ ఏజెంట్ను రాబిన్, అతని నలుగురు స్నేహితులు కిడ్నాప్ చేశారంటూ 2019 డిసెంబర్ 1వ తేదీన కేసు నమోదైంది. ఓ ఇంగ్లీష్ న్యూస్ ఛానల్ నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్లోనూ ఆయన రెడ్ హ్యాండెడ్గా దొరికారు. పాకిస్తాన్ మాజీ క్రికెటర్ హసన్ రజాతో కలిసి మ్యాచ్ ఫిక్సింగ్కు పాల్పడినట్టు ఆ న్యూస్ ఛానల్ నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్లో తేలింది. అనంతరం హసన్ రజా ఈ ఫిక్సింగ్ ఆరోపణలను తోసిపుచ్చారు.
ఫస్ట్క్లాస్ క్రికెట్ మ్యాచ్ల నుంచి రిటైర్ అయిన తరువాత రాబిన్ మోరిస్.. ప్రైవేట్ లీగ్ మ్యాచుల్లో ఆడుతున్నాడు. ఇదివరకు ఇండియన్ ఛాంపియన్ లీగ్ టోర్నమెంట్లలో అతను ముంబై ఛాంప్ తరఫున ఆడాడు. ఐపీఎల్ మ్యాచ్లను టార్గెట్గా చేసుకుని రాబిన్ మోరిస్ భారీగా బెట్టింగులకు పాల్పడుతున్నట్లు వెర్సోవా పోలీసులు తెలిపారు. అతని వద్ద నుంచి మరింత సమాచారాన్ని రాబట్టుకుంటున్నామని చెప్పారు.