ఐపీఎల్ బెట్టింగ్: రంగంలోకి దిగిన ఈడీ, సోదాలు
న్యూఢిల్లీ: ఐపీఎల్ బెట్టింగ్ రాయుళ్ల మీద ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు దాడులు చేస్తున్నారు. ఈ దెబ్బతో ఇంత కాలం దర్జాగా బెట్టింగ్ నిర్వహించిన బుక్కిలు అండర్ గ్రౌండ్ లోకి వెళ్లి పోయారు. శుక్రవారం ఉదయం ఈడీ అధికారులు రంగంలోకి దిగారు.
ఢిల్లీ, జైపూర్, బెంగళూరు, ముంబైతో పాటు పలు నగరలలో సోదాలు చేస్తున్నారు. ఐపీఎల్ -8 భాగంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు- రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో భారీ స్థాయిలో బెట్టింగ్ జరిగిందని పోలీసుల విచారణలో వెలుగు చూసింది.
ఈ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో బెట్టింగ్ ప్రమేయం ఉన్న బుకీ అనూప్ మహాజన్ అనే వ్యక్తిని పఠాన్ కోట్ పోలీసులు మే 21వ తేదీన అరెస్టు చేశారు. అతని దగ్గర నుండి రూ. 3.3 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఇతను తెలిపిన వివరాల ఆధారంగా ఈడీ రంగంలోకి దిగింది.
అనూప్ మహాజన్ తో పాటు ఐదుగురిని పఠాన్ కోట్ పోలీసులు అరెస్టు చేసి 13 మొబైల్ లు, విలువైన ఎలక్ట్రానిక్ వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. ఈడీ దర్యాప్తుకు పలు నగరాల పోలీసులు పూర్తి సహకారం అందిస్తున్నారు. బెట్టింగ్ రాయుళ్ల కోసం గాలిస్తున్నారు.