గురునాథ్పై ధోనీ వైఖరి: విభేదించిన ముద్గల్ కమిటీ
న్యూఢిల్లీ: గురునాథ్ మేయప్పన్పై చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజ్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ చెప్పిన మాటలతో జస్టిస్ ముద్గల్ కమిటీ విభేదించింది. ఐపియల్ మ్యాచ్ ఫిక్సింగ్, బెట్టింగ్ ఆరోపణలపై ముద్గల్ కమిటీ విచారణ జరిపిన విషయం తెలిసిందే. నివేదికలోని కొంత భాగం సోమవారంనాడు వెలుగులోకి వచ్చింది.
కేవలం క్రికెట్పై ఉత్సాహంతోనే మేయప్పన్ వ్యవహరించాడని, ఫ్రాంచైజ్తో సంబంధం లేదని ధోనీ కమిటీ ముందు చెప్పాడు. అయితే, చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజ్ జట్టు అధికారిగా ఉన్నాడని ముద్గల్ కమిటీ తేల్చి చెప్పింది. కమిటీ ముందు హాజరైన ధోనీ - ఎన్ శ్రీనివాసన్ అల్లుడు మేయప్పన్కు జట్టుతో సంబంధం లేదని చెప్పాడు.
సుప్రీంకోర్టుకు సమర్పించిన తొలి నివేదికలో ముద్గల్ కమిటీ - తమ ముందు హాజరైన ఇండియా సిమెంట్స్లో ప్రతినిధులు మేయప్పన్ షేర్ హోల్డర్ కారని, అందువల్ల చెన్నై సూపర్ కింగ్స్ యజమానికి ఆయనను పరిగణించలేమని చెప్పినట్లు వివరించింది.
చెన్నై సూపర్ కింగ్స్ జట్టుతో మేయప్పన్కు ఏ విధమైన సంబంధం లేదని ధోనీ, ఎన్ శ్రీనివాసన్, ఇండియా సిమెంట్స్ అధికారులు చెబుతూ వచ్చారు. కేవలం క్రికెట్పై అభిమానంతో బలపరిచాడని వారు అన్నారు. ధోనీ మాటలతో విభేదించినట్లు వచ్చిన వార్తలపై ముద్గల్ను పిటిఐ వార్తా సంస్థ సంప్రదించింది. అయితే, దానిపై మాట్లాడడానికి నిరాకరించారు. అది కోర్టులో ఉన్నందున మాట్లాడలేనని చెప్పారు.
మేయప్పన్ తరుచుగా హోటల్ గదిలో ఇండివిడ్యుయల్ 2ను కలుస్తుండేవాడని, దీన్నిబట్టి ఇండివిడ్యుయల్ 1 అయిన మేయప్పన్ ఆతన్ని సంప్రదిస్తూ వచ్చాడని తెలుస్తోందని కమిటీ అభిప్రాయపడింది.