ఢిల్లీ అల్లర్లపై అది పూర్తిగా తప్పుడు కథనం.. తీవ్రంగా ఖండిస్తున్నాం : ఐపీఎస్ అసోసియేషన్
దేశ రాజధాని ఢిల్లీలో గత నెలలో చోటు చేసుకున్న అల్లర్లకు సంబంధించి పలు అంతర్జాతీయ పత్రికలు ప్రచురించిన కథనాలపై ఐపీఎస్ అసోసియేషన్ స్పందించింది. పోలీసులే మత కల్లోలాలను రెచ్చగొట్టేలా వ్యవహరించారని.. ఒక వర్గం వారిని లక్ష్యంగా చేసుకున్నారని పేర్కొన్న కథనాలను తీవ్రంగా తప్పు పట్టింది. అల్లర్లను నియంత్రించడానికి ఢిల్లీ పోలీసులు చేసిన కృషిని పక్కనపెట్టి.. పక్షపాత కథనాలను ప్రచురించారని పేర్కొంది. కేవలం కొన్ని సంఘటనల ఆధారంగా ఢిల్లీ పోలీసులపై నిందలు మోపారని పేర్కొంది.
ఢిల్లీ అల్లర్లను తాము 36 గంటల్లోనే నియంత్రించగలిగామని.. మొత్తం 203 పోలీస్ స్టేషన్లు ఉంటే.. 191 పోలీస్ స్టేషన్ల పరిధుల్లో అల్లర్లు వ్యాప్తి చెందకుండా అదుపు చేయగలిగామని వివరణ ఇచ్చింది. ఆ క్రమంలో 85 మంది పోలీస్ సిబ్బంది గాయాలపాలయ్యారని,ఒక పోలీస్ హెడ్ కానిస్టేబుల్ మృతి చెందారని తెలిపింది. అల్లర్లలో గాయపడ్డ ఢిల్లీ డీసీపీ ఒకరు ఇప్పటికీ తలకు తీవ్ర గాయాలపాలై ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారని చెప్పుకొచ్చింది.
అల్లర్ల సమయంలో ప్రజలను కాపాడేందుకు పోలీసులు వ్యవహరించిన తీరును ఒకసారి పరిశీలించాలని విజ్ఞప్తి చేసింది. ఎంతమందిని పోలీసులు కాపాడారు.. ఎంతమంది క్షతగాత్రులను వారు ఆసుపత్రులకు తరలించారన్న డేటాను పరిశీలిస్తే.. ఎన్నో ఆదర్శవంతమైన కథనాలు పుట్టుకొస్తాయంది. ప్రతీ బాధితుడి కోసం తమ హృదయ ద్రవిస్తుందని.. సాధ్యమైనంతమేర నష్టాన్ని తగ్గించే పనే పోలీసులుగా తాము చేస్తామని వివరించింది. ఢిల్లీతో సహా భారత్లో పనిచేసే ప్రతీ పోలీస్ కుల,మతాలకు అతీతంగా లౌకిక విధానం ద్వారా ఎంపిక కాబడ్డవారేనని గుర్తుచేసింది.
India is governed by law, no one has immunity from killing anyone!
— IPS Association (@IPS_Association) March 13, 2020
Our comment on an article in @nytimes on #DelhiRiots2020@HMOIndia @DelhiPolice pic.twitter.com/0YKMSDdGWe
అల్లర్లపై ఢిల్లీ పోలీసులు ఇప్పటికే 700 ఎఫ్ఐఆర్లు,200 మందికి పైగా అరెస్టులు చేశారని తెలిపింది. అలాగే ప్రత్యక్ష సాక్షుల కథనం, కాల్ డేటా,సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా అల్లర్లతో సంబంధం ఉందని భావిస్తున్న 2500 మందిని అదుపులోకి తీసుకున్నట్టు వివరించింది. అల్లర్లకు సంబంధించిన కేసుల్లో అరెస్టయినవారిలో రెండు వర్గాలకు సంబంధించినవారు ఉన్నారని చెప్పుకొచ్చింది.
India is governed by law, no one has immunity from killing anyone!
— IPS Association (@IPS_Association) March 13, 2020
Our comment on an article in @nytimes on #DelhiRiots2020@HMOIndia @DelhiPolice pic.twitter.com/0YKMSDdGWe
భారత్కు స్వాతంత్ర్యం వచ్చిన 73 ఏళ్లలో 35వేల మంది పోలీసులు విధి నిర్వహణలో అమరులయ్యారని.. దేశ ప్రజల రక్షణ కోసం ప్రాణత్యాగం చేసినవారిపై ఇలా తప్పుడు కథనాలు ప్రచురించడం అనైతికమని స్పష్టం చేసింది. ఇలాంటి తప్పుడు కథనాలు ప్రచురించడం ద్వారా భారత పోలీస్ వ్యవస్థను బలహీనపరచడం తప్ప సాధించేదేమీ లేదని పేర్కొంది. ఢిల్లీ అల్లర్లలో పోలీసులు ప్రేక్షకుల్లా మిగిలిపోయారని పేర్కొనడం.. కేవలం సంచలనం కోసం పాకులాడటమేనని విమర్శించింది. అయితే విచారణలో దోషులుగా తేలే పోలీసులూ చట్టపరంగా శిక్షించబడుతారని స్పష్టం చేసింది. చివరగా,భారత్ చట్టానికి లోబడే పాలించబడుతోందని.. ఎవరినో చంపే అధికారం ఇక్కడెవరికి లేదని తెలిపింది.