హైప్రొఫైల్ రేప్ కేసులో బాస్ వేధింపు: మహిళా ఐపిఎస్
న్యూఢిల్లీ: తన పైస్థాయి అధికారి వేధిస్తున్నారంటూ గుర్గావ్ జాయింట్ ట్రాఫిక్ పోలీసు కమిషనర్ భారతీ అరోరా ఆరోపించారు. హై ప్రొఫైల్ అత్యాచార కేసుకు సంబంధించి అంశంలో మానసికంగా వేధిస్తున్నారని ఆమె ఆరోపించారు. అనవసర జోక్యం చేసుకుంటున్నారని ఆరోపించారు.
ఈ విషయమై సిబిఐచే విచారణ జరిపించాలని ఆమె డిమాండ్ చేశారు. హర్యానా డీజీపీకి ఇందుకు సంబంధించి లేఖ రాస్తున్నట్లు చెప్పారు. ఆమె ఆరోపణలు చేస్తున్న ఉన్నతాధికారి నవదీప్ సింగ్ విర్క్. అయితే, ఈ ఆరోపణలను ఆయన కొట్టి పారేస్తున్నారు.
హర్యానా డిజిపి యశ్పాల్ సింఘాల్కు ఈ విషయమై లేఖ రాస్తున్నట్లు చెప్పారు. ఈ కేసులో సిబిఐ దర్యాఫ్తు చేయాలని కోరుతానన్నారు. నవదీప్ సింఘ్ విర్క్ అనవసర జోక్యం చేసుకుంటున్నారన్నారు.
ఓ రేపు కేసులో సీనియర్ ఐపీఎస్ తనయుడు అజయ్ భరద్వాజ్ నిందితుడిగా ఉన్నాడు. ఈ కేసులో అతని పేరును ఉద్దేశ్యపూర్వకంగా కలిపారని ఆరోపించారు.
తాను కేసు విచారణ చేపట్టగానే అసలు విషయం గుర్తించానని, అతనిని అనవసరంగా ఇరికించారని అర్ధమైందని చెప్పారు. దీనిపై తాను అభ్యంతరం వ్యక్తం చేశానన్నారు. అంతేకాదు, ఇది సరైనది కాదని సదరు పైస్థాయి అధికారికి చెప్పానన్నారు.
అప్పటి నుంచి అతను తనను మానసికంగా వేధిస్తున్నారని ఆరోపించారు. అంతేకాదు, అతను తన కెరీర్ను ఇబ్బందుల్లో పడేసినా పడేయవచ్చని అనుమానం వ్యక్తం చేశారు.
మరోవైపు, నవదీప్ సింగ్ విర్క్ కూడా దీనిపై డీజీపీకి లేఖ రాశారు. అత్యాచార నిందితుడి సోదరి జాయింట్ పోలీసు కమిషనర్ భారతీ అరోరాకు తెలుసునని, అందుకే అతనిని కాపాడే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. అజయ్ భరద్వాజ్ ఎమ్మెన్సీలో పని చేస్తున్నారు. ఇతను మాజీ డిప్యూటీ కమిషనర్ తనయుడు.