ఐపీఎస్ ఇంట్లో డ్రగ్స్ దందా.. వెయ్యి కోట్ల విలువైన డ్రగ్స్ పట్టుకున్న ఎన్సీబీ..
నోయిడా : యూపీ నోయిడాకు సమీపంలో అదో ఐపీఎస్ ఆఫీసర్కు చెందిన ఇళ్లు. ఖాళీగా ఉంచడమెందుకన్న ఉద్దేశంతో బ్రోకర్ ద్వారా అద్దెకు ఇచ్చాడు. కిరాయికి తీసుకున్న కేటుగాళ్లు ఐపీఎస్ ఇల్లు కదా మన జోలికెవరెస్తారన్న ధీమాతో దర్జాగా డ్రగ్స్ దందా మొదలుపెట్టారు. చివరకు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులకు చిక్కి కటకటాల పాలయ్యారు. తన ఇంట్లో డ్రగ్స్ దందా జరుగుతున్న విషయం తెలిసి సదరు ఐపీఎస్ అవాక్కయ్యాడు.
వెయ్యి కోట్ల విలువైన డ్రగ్స్
యూపీ నోయిడా సమీపంలో మాదకద్రవ్యాలు పట్టుబడ్డ ఘటన సంచలనం సృష్టించింది. దేశంలో ఇప్పటి వరకు ఎన్నడూ పట్టుబడనంత స్థాయిలో డ్రగ్స్ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పక్కా సమాచారంతో దాడులు నిర్వహించిన నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు... 1,818కిలోల మాదక ద్రవ్యాలను సీజ్ చేశారు. దాని ఖరీదు వెయ్యి కోట్ల వరకు ఉంటుందని అధికారులు చెప్పారు. ఘటనకు సంబంధించి ఇద్దరు నైజీరియా దేశస్తులతో పాటు దక్షిణాఫ్రికా జాతీయున్ని అరెస్ట్ చేశారు. తన ఇంట్లో డ్రగ్స్ దందా నడుస్తోందన్న విషయం తెలిసి
చిన్న క్లూతో కదిలిన డొంక
నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు తమకు దొరికిన చిన్న సమాచారం ఆధారంగా దాడి చేసి డ్రగ్స్ ముఠా ఆట కట్టించారు. ఢిల్లీ ఎయిర్పోర్టులో అనుమానాస్పదంగా కనిపించిన 31ఏళ్ల విదేశీ మహిళను ప్రశ్నించగా.. విషయం బయటపడింది. ఆమె బ్యాగునుంచి 24.7కిలోల మాదక ద్రవ్యాలను గుర్తించిన సీఐఎస్ఎఫ్ సిబ్బంది ఆరాతీయగా.. నైజీరియన్ల జాడ తెలిసింది. వివిద మార్గాల ద్వారా అక్రమంగా సేకరించిన రసాయనాలతో డ్రగ్స్ తయారూ చేస్తున్నట్లు నిందితులు విచారణలో చెప్పారు. ఢిల్లీతో పాటు విదేశాలకు డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు అంగీకరించారు.
పోలీసుల దర్యాప్తులో దిమ్మదిరిగి నిజాలు
డ్రగ్స్ తయారీకి ముఠా వినియోగించుకున్న ఇల్లు ఓ ఐపీఎస్ అధికారికి చెందినదిగా అధికారులు గుర్తించారు. యూపీ ఎకనమిక్ అఫెన్సెస్ వింగ్లో పనిచేస్తున్న ఆయనను సంప్రదించారు. బ్రోకర్ ద్వారా తాను ఇంటిని కిరాయికి ఇచ్చినట్లు తెలుసుకున్నారు. అక్కడ ఏం జరుగుతుందో తనకు తెలియదన్న సదరు ఐపీఎస్ అధికారి గత ఏడాదిగా వారు అద్దె ఇవ్వలేదని చెప్పడం కొసమెరుపు.