సోహ్రబుద్దీన్ బూటకపు ఎన్కౌంటర్ కేసు విచారణ చేసిన ఐపీఎస్ అధికారి సస్పెండ్
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సోహ్రాబుద్దీన్, తులసీ ప్రజాపతి బూటకపు ఎన్కౌంటర్ కేసును విచారణ చేస్తున్న ఐపీఎస్ అధికారిని కేంద్ర హోంశాఖ సస్పెండ్ చేసింది. 1992 ఐపీఎస్ బ్యాచ్ గుజరాత్ క్యాడర్కు చెందిన రజ్నీష్ రాయ్ ఈ హైప్రొఫైల్ కేసును విచారణ చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన డిప్యూటేషన్ పై ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాలో యాంటీ టెరరిజం స్కూల్ ఆఫ్ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్సులో పనిచేస్తున్నారు.
ఆగష్టులో తను వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకోవాలని భావిస్తున్నట్లు కేంద్ర హోంశాఖకు లేఖ రాశారు. తన సర్వీస్కు రాజీనామా చేస్తున్నట్లుగా భావించాలని ఆ లేఖలో రజ్నీష్ రాయ్ కోరారు. అయితే ఆయన పెట్టుకున్న పిటిషన్ను కేంద్ర హోంశాఖ తిరస్కరించింది. వీఆర్ఎస్కు దరఖాస్తు చేసుకున్న తర్వాత ఆయన విధులకు దూరంగా ఉన్నారు. విధులకు హాజరు కావడం లేదన్న నెపంతో రజ్నీష్ రాయ్ను సస్పెండ్ చేస్తూ కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీచేసింది.
రజ్నీష్ రాయ్ పై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటున్నట్లు ఆదేశాల్లో పేర్కొంది. చిత్తూరు జిల్లాలోని సీఐఏటీ స్కూలు, సీఆర్పీఎఫ్ ప్రిన్సిపాల్గా రజ్నీష్కు పోస్టింగ్ ఇవ్వగా ఆయన తన విధులకు హాజరుకానందును ఆయనపై సస్పెన్షన్ వేటు వేస్తున్నట్లు కేంద్ర హోంశాఖ తెలిపింది. అంతేకాదు డీజీ అనుమతి లేనిదే రజ్నీష్ చిత్తూరు జిల్లాను విడిచి వెళ్లరాదని ఆదేశాల్లో తెలిపింది. ఈ ఆదేశాలుసస్పెన్షన్ ఎత్తివేసే వరకు అమల్లో ఉంటాయని స్పష్టం చేసింది.
కేంద్రహోంశాఖ ఆదేశాలపై స్పందిస్తూ రాయ్ మరో లేఖ రాశారు. తనపై సస్పెన్షన్ విధిస్తూ కేంద్ర హోంశాఖ ఇచ్చిన ఆదేశాలు రాజ్యాంగ విరుద్ధమని వెల్లడించారు. 30 నవంబర్ 2018న తన విధులను నిర్వర్తించి తాను పదవీవిరమణ చేసినట్లు వెల్లడించారు. ఇదిలా ఉంటే 2007లో సీఐడీ క్రైమ్ డీఐజీగా పనిచేసిన రజ్నీష్ రాయ్ షోహ్రాబుద్దీన్ కేసులో ముగ్గురు ఐపీఎస్ అధికారులను అరెస్టు చేశారు. ఇందులో డీజీ వంజారా, రాజ్కుమార్ పాండియన్, దినేష్ ఎమ్ఎన్లు ఉన్నారు. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు సోహ్రాబుద్దీన్ కేసును సీబీఐకి అప్పగించడం జరిగింది. అంతేకాదు కేసు విచారణ గుజరాత్ నుంచి మహారాష్ట్రకు బదిలీ చేయడం జరిగింది. ఇదిలా ఉంటే కేసుకు సంబంధించిన తీర్పు శుక్రవారం ఇవ్వనుంది సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం.