ముందస్తు ప్లాన్: స్టాలిన్పై దాడిచేసింది ఐపీఎస్ అధికారులే!..
మార్షల్స్ ముసుగులో ఉన్న ఐపీఎస్ అధికారులతోనే స్టాలిన్ పై దాడి చేయించారని డీఎంకె శ్రేణులు ఆరోపిస్తున్నాయి.
చెన్నై: దేశంలో మీడియా మొత్తం గత కొద్దిరోజులుగా తమిళ పాలిటిక్స్ పై స్పెషల్ ఫోకస్ పెట్టింది. క్షణ క్షణ ఉత్కంఠతో సినిమాలను మించిన ట్విస్టులతో ఇటు జనాల్లోను వాడి వేడి చర్చలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.
అయితే శనివారం దాకా అన్నాడీఎంకె చుట్టూ తిరిగిన రసవత్తర పాలిటిక్స్ కాస్త ఒక్కసారిగా డీఎంకె వైపు టర్న్ తీసుకున్నాయి. చిరిగిన చొక్కాతో స్టాలిన్ చేసిన హంగామా జాతీయ మీడియాలో డీఎంకెను మరోసారి వార్తల్లోకి ఎక్కించింది.
కాగా, స్టాలిన్ పై దాడి అనుకోని ఘటన కాదని, ముందస్తు వ్యూహాం ప్రకారమే ఆయనపై దాడి చేయించారని డీఎంకె నేతలు ఆరోపిస్తున్నారు. మార్షల్స్ ముసుగులో 9మంది ఐపీఎస్ అధికారులు సభలోకి వచ్చినట్లుగా వారు చెబుతున్నారు.
మార్షల్స్ ముసుగులో ఉన్న ఐపీఎస్ అధికారులతోనే స్టాలిన్ పై దాడి చేయించారని డీఎంకె శ్రేణులు ఆరోపిస్తున్నాయి. అంతేకాదు దీనికి సంబంధించి పలు ఆధారాలను కూడా డీఎంకె సంపాదించినట్లు సమాచారం. స్టాలిన్ పై దాడికి గవర్నర్ విచారణకు ఆదేశించడంతో.. విచారణలో 9మంది ఐపీఎస్ లను గుర్తించినట్లు తెలుస్తోంది.
స్పీకర్ సభలో లేకున్నా.. మార్షల్స్ ముసుగులో అసెంబ్లీకి వచ్చిన ఐపీఎస్ అధికారులు స్టాలిన్ ను బలవంతంగా బయటకు లాక్కెళ్లారని విచారణలో తేలినట్లుగా చెబుతున్నారు. దీనిపై వివరణ ఇచ్చుకున్న స్పీకర్ సభలో పరిస్థితులు చేయి జారిపోతుండటంతో అప్పటికప్పుడు వారిని రంగంలోకి దించాల్సి వచ్చిందని పేర్కొనట్లు సమాచారం.
ఇదంతా ముందస్తు వ్యూహామేనని, లేనిపక్షంలో అప్పటికప్పుడు వారికి యూనిఫాంలు ఎక్కడినుంచి తీసుకొచ్చారని డీఎంకె ప్రశ్నిస్తోంది. స్టాలిన్ పై దాడికి సంబంధించి డీఎంకె బయటపెట్టిన ఆధారాలు ఇప్పుడు సదరు ఐపీఎస్ అధికారులకు లేని చిక్కులు తెచ్చిపెట్టనట్లయింది.