ఛార్జీలు పెరుగుతాయి: పాక్ ఇరాన్ గగనతలం మూసివేతతో భారం కానున్న విమాన ప్రయాణం
ఇరాన్ అమెరికాల మధ్య వాణిజ్య యుద్ధం ముదురుతోంది. జూన్ 20న అమెరికా నిఘా డ్రోన్ను ఇరాన్ బలగాలు కూల్చివేయడంతో ఈ రెండు దేశాల మధ్య సమస్య మరింత జటిలమైంది. ఇక జూన్ 20 నుంచి ప్రపంచంలోని ప్రధాన విమానాయాన సంస్థలన్నీ తమ రూట్లలో మార్పులు చేసుకున్నాయి. ఇరాన్ గగనతలం నుంచి కాకుండా ప్రత్యామ్నాయ రూట్లలో ప్రయాణిస్తున్నాయి. ఇరాన్ పొరపాటున దాడులు చేస్తే భారీ నష్టాన్ని చవిచూడాల్సి వస్తుందన్న భయం నెలకొనడంతో విమానాయాన సంస్థలు తమ రూట్లను మార్చుకున్నాయి. పర్షియా గల్ఫ్-గల్ఫ్ ఆఫ్ ఓమన్ల మధ్య హర్మోజ్ స్ట్రెయిట్ ఉండటంతో ఆ ప్రదేశాన్ని చాలా విమానాయాన సంస్థలు నో గో జోన్గా పరిగిణిస్తున్నాయి. అలా పరిగణించే దేశాల్లో భారత్ కూడా ఉంది.
ఇరాన్ గగనతలం మీదుగా అమెరికా విమానాలకు నో ఎంట్రీ
అమెరికా నిఘా డ్రోన్ను ఇరాన్ కూల్చివేయడంతో ఇరాన్ నియంత్రణలో ఉన్న గగనతలంలో అమెరికా విమానాయాన సంస్థలు ప్రయాణించరాదని అగ్రరాజ్యం అమెరికా ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యంగా భారత్ నుంచి అమెరికాకు వెళ్లే విమానాలు ఇరాన్ గగనతలం మీదుగా ప్రయాణించాల్సి ఉంటుంది. ఇప్పుడు అమెరికా ప్రకటనతో చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. దీంతో ప్రత్యామ్నాయ రూట్లు తీసుకోవాల్సి వస్తోంది. పాశ్చాత్య దేశాలు అయిన అమెరికా, కెనడా దేశాలకు వెళ్లాలంటే ప్రత్యామ్నాయ రూట్లలో వెళ్లాల్సి వస్తోంది. అంటే దూరం పెరగడంతో విమానా ఛార్జీలు కూడా పెరిగిపోతున్నాయి. అంతేకాదు ఆంక్షలు విధించడంతో భారత్కు రావాల్సిన పలు అమెరికా విమానాలను ఆయా విమానాయాన సంస్థలు రద్దు చేశాయి. ఇప్పటికే ముంబై నుంచి న్యూయార్క్ వెళ్లే బ్రిటీష్ ఎయిర్వేస్ రూటు మార్చింది.
ప్రత్యామ్నాయ రూట్లలో ప్రయాణిస్తున్న విమానాలు
ముంబై నుంచి న్యూయార్క్ వెళ్లాల్సిన లుఫ్తాన్సా ఎయిర్లైన్స్, కేఎల్ఎం రాయల్ డచ్ ఎయిర్ లైన్స్ కూడా ఇరాన్ గగనతలం నుంచి కాకుండా ప్రత్యామ్నాయ రూట్లను అనుసరిస్తున్నాయి. మరోవైపు ఎమిరేట్స్ కూడా ప్రత్యామ్నాయ మార్గాల్లో తమ విమానాలను నడుపుతోంది. ప్రయాణికుల భద్రతను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ స్పష్టం చేసింది. ప్రస్తుతం ఇరాన్ గగనతలం వినియోగించకపోవడంతో కొన్ని ఇబ్బందులు తలెత్తుతున్న మాట వాస్తవమేనని ఎమిరేట్స్ తెలిపింది. అమెరికన్ ఎయిర్లైన్స్, డెల్టా ఎయిర్లైన్స్, జపాన్ ఎయిర్లైన్స్ కూడా ఇరాన్ గగనతలంను విస్మరించి ప్రత్యామ్నాయ మార్గాల్లో విమానాలను నడుపుతున్నాయి. ఇప్పటికే ట్రంప్ సర్కార్ తీసుకొచ్చిన వీసా విధానాలతో నష్టాల్లో ఉన్న విదేశీ విమానాయాన సంస్థలు... తాజాగా ఇరాన్ గగనతలంను కాకుండా ఇతర రూట్లలో వెళ్లడంతో మరింత నష్టాల బాటపట్టే అవకాశం ఉందని చెబుతున్నాయి.
ఇరాన్ గగనతలం మూసివేయడంతో భారీగా పెరిగిన టికెట్ ధరలు
ఇరాన్ గగనతలం మూసివేయడంతో పాశ్చాత్యదేశాల నుంచి భారత్కు వచ్చే విమాన టికెట్ల ధర మరింత పెరగనుంది.ఇక ఈ ఏడాది ఫిబ్రవరి 26 నుంచి భారత విమానాలకు పాక్ గగనతలంలో అనుమతి లేదు. పుల్వామా దాడుల తర్వాత బాలాకోట్ దాడులు చేయడంతో పాకిస్తాన్ భారత విమానాలు తమ గగనతలంలోకి ప్రవేశించరాదనే హుకూం జారీ చేశాయి. జూన్ 28వ తేదీ వరకు ఈ నిషేధం పొడిగిస్తూ ఈ మధ్యే నిర్ణయం తీసుకుంది. పాకిస్తాన్ నిషేధం విధించడంతో ఆగ్నేసియా నుంచి వస్తున్న విమానాలపై ఈ ప్రభావం భారీగా కనిపిస్తోంది. మొత్తానికి పాకిస్తాన్ గగనతలం, ఇరాన్ గగనతలం తిరిగి తెరుచుకునేవరకు విమాన ;ఛార్జీల మోత తప్పదని నిపుణులు చెబుతున్నారు.