హాట్ కేకుల్లా రైల్వే టికెట్లు.. బుకింగ్ 2గం. ఆలస్యమైనా.. 10 నిమిషాల్లో సోల్డ్-ఔట్..
దాదాపు 50 రోజుల తర్వాత రైలు సర్వీసులు నేటి నుంచి పున:ప్రారంభం కానున్నాయి. మొదటి విడతలో దేశవ్యాప్తంగా కేవలం 15 రైళ్లు మాత్రమే నడవనున్నాయి. వీటిల్లో ప్రయాణానికి సంబంధించి కేవలం ఒకరోజు ముందు(మే 11) మాత్రమే రైల్వే శాఖ బుకింగ్స్ ప్రారంభించింది. అయినప్పటికీ టికెట్లన్నీ హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. హౌరా-న్యూఢిల్లీ ట్రైన్ టికెట్లు కేవలం 10 నిమిషాల్లో అమ్ముడుపోవడం విశేషం.
Recommended Video
విశాఖ గ్యాస్ ప్రభావంతో స్పృహ కోల్పోయిన రైలు డ్రైవర్, గార్డ్.. వాల్తేర్ డివిజన్లో రైళ్లన్నీ రద్దు...
9గంటల వరకు 30వేల పీఎన్ఆర్..
'సోమవారం రాత్రి 9.15గంటల వరకు సుమారుగా 30వేల పీఎన్ఆర్(ప్యాసింజర్ నేమ్ రికార్డు) జనరేట్ అయ్యాయి. సుమారు 54వేల పైచిలుకు ప్రయాణికులకు రిజర్వేషన్స్ జారీ అయ్యాయి. అయితే బుకింగ్ ద్వారా టికెట్లు పొందే సదుపాయం మే 18 వరకే ఉంటుంది. సాధారణ రోజుల్లో అయితే ప్రతీరోజూ 7లక్షల నుంచి 9లక్షల టికెట్లు ఐఆర్సీటీసీ వెబ్ సైట్ ద్వారా బుక్ అయ్యేవి.' అని రైల్వే అధికారులు వెల్లడించారు.
రెండు గంటలు ఆలస్యం.. అయినా హాట్ కేకుల్లా..
సోమవారం సాయంత్రం 4గంటల నుంచి బుకింగ్స్ మొదలవుతాయని చెప్పడంతో.. ఆ సమయానికి వేలాది మంది ఐఆర్సీటీసీ వెబ్ సైట్లోకి వచ్చారు. అయితే ముందస్తు షెడ్యూల్ కంటే రెండు గంటలు ఆలస్యంగా 6గంటలకు బుకింగ్స్ మొదలయ్యాయి. దీంతో సైట్పై ఎక్కువ ట్రాఫిక్ ఉండటంతో క్రాష్ అయిందా అన్న సందేహాలు వ్యక్తమయ్యాయి. అయితే అలాంటిదేమీ లేదని రైల్వే శాఖ స్పష్టం చేసింది. స్పెషల్ ట్రైన్స్ డేటాను సైట్లో అప్లోడ్ చేయడంలో కాస్త జాప్యం జరిగిందన్నారు. అయితే బుకింగ్స్ మొదలైన కాసేపటికే నిమిషాల వ్యవధిలో టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. హౌరా-న్యూఢిల్లీ ట్రైన్ ఏసీ-1,ఏసీ-3 టికెట్లు మొదటి 10 నిమిషాల్లోనే అమ్ముడుపోయాయి. ఈ ట్రైన్ షెడ్యూల్ ప్రకారం మంగళవారం సాయంత్రం 5.05గంటలకు బయలుదేరుతుంది.
సౌత్కి వెళ్లేవారికి దొరకని టికెట్లు..
భువనేశ్వర్-న్యూఢిల్లీ ట్రైన్ టికెట్లు కూడా 7.30గం. లోపే అమ్ముడుపోయాయి. ముఖ్యంగా తూర్పు వైవపు-హౌరా,భువనేశ్వర్,అగర్తలా వెళ్లే రైళ్ల టికెట్లన్నీ పూర్తిగా బుక్ అయిపోయాయి. అలాగే ముంబై వెళ్లే రైళ్ల టికెట్లు కూడా పూర్తిగా బుక్ అయ్యాయి. ఒకేసారి వేలమంది టికెట్ బుకింగ్స్కి ప్రయత్నించడంతో చాలామందికి టికెట్లు దొరకలేదు. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలకు వెళ్లే రైళ్లు,రిటర్న్ జర్నీలో న్యూఢిల్లీకి వెళ్లే రైళ్లలో చాలామందికి టికెట్లు దొరకలేదు.
నిబంధనలు పాటించడం తప్పనిసరి..
గతంలో మాదిరి కాకుండా ఈసారి రైళ్లలో ప్రయాణిస్తున్నవారికి కాస్త భిన్నమైన అనుభవం కలుగుతుందని రైల్వే అధికారులు చెబుతున్నారు. అన్ని రైళ్లలో భౌతిక దూరం తప్పనిసరిగా పాటించేలా చర్యలు తీసుకున్నామన్నారు. ప్రయాణికులకు స్క్రీనింగ్ టెస్టులు తప్పనిసరి అని,ఆరోగ్య సేతు యాప్ను కూడా తప్పనిసరిగా ఉపయోగించాలని చెబుతున్నారు. కాగా, మే 12 తర్వాత క్రమంగా రైలు సర్వీసులను పెంచుతామని ఐఆర్సీటీసీ ప్రకటించడంతో బీఎస్ఈ,ఎన్ఎస్ఈలో దాని షేర్లు 5శాతం మేర పెరిగాయి.