ఐఆర్సీటీసీ స్కాం షాక్: లాలూ, రబ్రీ, తేజస్వికి ఢిల్లీ కోర్టు సమన్లు
న్యూఢిల్లీ: ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబానికి మరో షాక్ తగిలింది. ఐఆర్సీటీసీ మనీ లాండరింగ్ కేసులో ఢిల్లీ కోర్టు సోమవారం లాలూ ప్రసాద్, ఆయన భార్య రబ్రీ దేవీ, కుమారుడు తేజస్వీ యాదవ్లకు సమన్లు జారీ చేసింది. దీనికి సంబంధించి నిందితులు అక్టోబరు ఆరున కోర్టు ముందు హాజరు కావాలని ఆదేశించింది.
అలాగే లాలూ ఇప్పటికే రాంచీ జైల్లో శిక్ష అనుభవిస్తుండటంతో ఆయనకు ప్రొడక్షన్ వారెంట్ జారీ చేసింది. ఈ కేసులో ఈడీ దాఖలు చేసిన ఛార్జిషీటును విచారించడానికి ముందు కేసుకు సంబంధించిన పత్రాలను పరిశీలించడానికి వారం రోజుల క్రితం కోర్టు కొంత సమయం కావాలని కోరింది.
సుజాత ప్రైవేటు లిమిటెడ్ హోటల్కు రెండు రైల్వే హోటళ్ల సబ్ లీజ్ రైట్ను ఇచ్చే విషయంలో ఐఆర్సీటీసీ అధికారులు, లాలూ ప్రసాద్ యాదవ్ తమ అధికారాన్ని దుర్వినియోగం చేశారని ఈడీ ఆరోపించింది. దానికి బదులుగా పాట్నాలోని ఓ స్థలాన్ని డిలైట్ మార్కెటింగ్ ప్రైవేటు లిమిటెడ్ కంపెనీకి బదిలీ చేశారు. అది కూడా చాలా తక్కువ ధరకు అని పేర్కొంది.
డిలైట్ అధినేత..ఆర్జేడీ ఎంపీ అలాగే లాలూ కుటుంబానికి సన్నిహితుడు కావడం గమనార్హం. ఆ తరవాత ఆ స్థలంలో అత్యధిక భాగం రబ్రీదేవి, తేజస్వీ యాదవ్ల పేరు మీదకు మారిందని అభియోగపత్రాల్లో ఈడీ వెల్లడించింది. ఈ కేసుకు సంబంధించి సీబీఐ ఇప్పటికే లాలూ ప్రసాద్, ఆయన భార్య, కుమారుడులకు సమన్లు జారీ చేసింది.