IRCTC నుంచి సొంత పేమెంట్ గేట్ వే:టికెట్ బుకింగ్ సులభతరం-రీఫండ్ కూడా త్వరగానే..!
మీరు ట్రైయిన్లో దూర ప్రాంతాలకు ప్రయాణం చేయాలనుకుంటున్నారా..? ఆన్లైన్లో టికెట్ బుక్ చేయడం కష్టమవుతోందా..? అలానే మీరు ఇప్పటికే బుక్ చేసిన టికెట్ క్యాన్సిల్ చేస్తే ఆ రీఫండ్ డబ్బులు వచ్చేందుకు చాలా సమయం తీసుకుంటోందా... అదంతా ఒకప్పుడు... ఇప్పటి నుంచి వీటన్నిటికీ చెక్ పెట్టింది ప్రముఖ టికెటింగ్ సంస్థ ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ సంస్థ. ఇప్పటి వరకు టికెట్ బుక్ చేయాలంటే ఐఆర్సీటీసీలో టికెట్ బుక్ చేసుకుని పేమెంట్ కోసం థర్డ్ పార్టీ పై ఆధారపడాల్సి వచ్చేది. ఇప్పుడు ఆ పరిస్థితి ఉండదు.
సొంత పేమెంట్ గేట్వేను తీసుకొచ్చిన ఐఆర్సీటీసీ
ఐఆర్సీటీసీ ద్వారా ఇప్పటి వరకు యాప్ పై లేదా వెబ్సైట్ పై టికెట్లు బుక్ చేసుకోవడం కానీ, బుక్ చేసుకున్న టికెట్లను కానీ రద్దు చేసుకునే వాళ్లం. అయితే ఈ ప్రక్రియ కాస్త కష్టతరంగా ఉండేది. ఈ సమస్యలకు చెక్ పెడుతూ ముందుగా ఐఆర్సీటీసీ తన వెబ్సైట్ను అప్డేట్ చేసింది. ఇప్పుడు తాజాగా పేమెంట్ గేట్వేను కూడా సొంతంగా ప్రారంభించింది. ఇప్పటి వరకు పేమెంట్ గేట్వే థర్డ్ పార్టీ ద్వారా జరిగేది. దానికి స్వస్తి పలుకుతూ సొంత పేమెంట్ గేట్వేను ప్రారంభించింది ఐఆర్సీటీసీ. వినియోగదారులకు మరింత చేరువైంది. ప్రస్తుతం ఈ ప్రక్రియ అందుబాటులోకి వచ్చింది.
సమయం ఆదా..రీఫండ్ కూడా వెంటనే
కొత్త వెసులు బాటు అందుబాటులోకి రాకముందు, ఒక ప్రయాణికుడు టికెట్ బుక్ చేయాలనుకున్నప్పుడు చాలా సమయం వేచి చూడాల్సి వచ్చేది. ముందుగా ప్యాసింజర్ వివరాలు నమోదు చేసి ఆపై డబ్బులు చెల్లించే సమయంలో చాలా సేపు వేచి చూడాల్సి వచ్చేది. వారు ఏ బ్యాంకు నుంచి అయితే చెల్లింపులు చేయాలనుకునేవారో... ఆ బ్యాంకు నుంచి అనుమతి వచ్చేవరకు పేమెంట్ గేట్వేపై వేచిచూడాల్సి వచ్చేది. ఇప్పుడు ఆ సమస్యకు చెక్ పెడుతూ సొంత పేమెంట్ గేట్వేను ఐఆర్సీటీసీ అందుబాటులోకి తీసుకువచ్చింది. IRCTC-iPay ద్వారా ప్రయాణికులు టికెట్ రద్దు చేసిన వెంటనే డబ్బులు రీఫండ్ అవుతాయి.
ఎలా నమోదు చేసుకోవాలి
భారత్ స్వావలంబన దిశగా పయనిస్తున్న నేపథ్యంలో ప్రయాణికులకు రైల్వేశాఖకు అనుబంధంగా ఉన్న ఐఆర్సీటీసీని అప్గ్రేడ్ చేసింది. ఇక IRCTC-iPay ద్వారా లావాదేవీలు జరిపేందుకు ముందుగా ప్రయాణికులు డెబిట్ కార్డు లేదా యూపీఐ బ్యాంకు అకౌంట్ వివరాలు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఇక భవిష్యత్తులో కొనుగోలు చేసే టికెట్లన్నిటికీ ఈ డెబిట్ కార్డు లేదా యూపీఐ బ్యాంకు వివరాల ద్వారా సింగిల్ క్లిక్తో చేసుకోవచ్చు. దీనివల్ల టికెట్ బుకింగ్ సమయం త్వరగా పూర్తవడమే కాకుండా బోలెడంత సమయం ఆదా అవుతుంది.
మొత్తానికి ఈ అప్గ్రేడ్ అయిన వెర్షన్తో ప్రయాణికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇదివరకటిలా ఎక్కువ సేపు వేచిచూసి టికెట్ బుక్ అవుతుందో లేదో అన్న టెన్షన్ నుంచి కాస్త విముక్తి లభించినట్లయ్యిందని చెబుతున్నారు.