ఐఆర్సీటీసీ ఐపీఓ భారీ స్పందన: తొలి రోజే 81శాతం సబ్స్క్రైబ్
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ రైల్వేలకు చెందిన ఆన్లైన్ టికెటింగ్, టూరిజం, కేటరింగ్ సంస్థ ఐఆర్ సీటీసీ ఐపీవోకు వెళ్లిన తొలి గంటలోనే మొత్తం షేర్లలో 8శాతం షేర్లు సబ్స్క్రైబ్ అయ్యాయి. తొలిరోజు మొత్తంగా చూసుకున్నట్లయితే 81శాతం షేర్లు సబ్ స్క్రైబ్ కావడం విశేషం.
సోమవారం ఉదయం 11గంటల సమయానికి 16,06,560 షేర్లకు బిడ్లు అందాయి. కాగా, మొత్తం 2,01,60,000 వాటాలను మదుపరులకు అందుబాటులో ఉంచారు. అక్టోబర్ 3వ తేదీ వరకు బిడ్లను స్వీకరిస్తారు. ఒక్కో షేరు మద్దతు ధర రూ. 315-320గా నిర్ణయించారు. దీనిపై మొత్తం రూ. 645 కోట్లు సేకరించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. పెట్టుబడుల ఉపసంహరణలో చర్యల్లో భాగంగా ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయించింది.
ఈ ఆఫర్లో ప్రభుత్వం 12.5శాతం వాటాను ఆఫర్ ఫర్ సేల్ కింద విక్రయిస్తోంది. దీంతో ప్రభుత్వ వాటా 87.5శాతానికి తగ్గుతుంది. ఐఆర్ సీటీసీ ఆన్లైన్ రైల్వే టికెట్లు, భోజనం, తాగునీరు సేవలను అందిస్తోంది. గత మూడు నెలల్లోనే నెలకు సగటున 15-18 మిలియన్ల లావాదేవీలు నమోదు కావడం గమనార్హం.
గత సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది 23.5శాతం పెరిగాయి. కాగా, ఐడీబీఐ క్యాపిటల్ మార్కెట్స్, ఎస్ బీఐ క్యాపిటల్ మార్కెట్లు, యస్ సెక్యూరిటీ సంస్థలు ఈ ఐపీఓకు బుక్ రన్నింగ్ లీడ్ మేనేజర్లుగా వ్యవహరిస్తున్నాయి. అలంకిత్ అసైన్మెంట్స్ లిమిటెడ్ సంస్థ దీనికి రిజిస్ట్రార్గా వ్యవహరిస్తోంది.
ఐఆర్ సీటీసీ ఐపీవో ముగిసిన తర్వాత అక్టోబర్ 9న షేర్ల కేటాయింపు ఉండొచ్చనే అంచనాలున్నాయి. కంపెనీ షేర్లు బీఎస్ఈ, ఎన్ఎస్ఈలో అక్టోబర్ 14న లిస్ట్ అవుతాయి. షేర్లు కొనుగోలు చేయాలని భావించే వారు కనీసం 40 షేర్లు కొనాల్సి ఉంటుంది. దీంతో రిటైల్ ఇన్వెస్టర్లు ఐర్ సీటీసీ షేర్లు కొనడానికి చేతిలో రూ.12,200 నుంచి 12,400 వరకు కలిగివుంటే సరిపోతుంది.