నేటి నుంచి పట్టాలెక్కనున్న తేజాస్ ఎక్స్ప్రెస్ రైళ్లు... ఈ నిబంధనలు తప్పనిసరిగా పాటించాల్సిందే...
కరోనా లాక్ డౌన్ కారణంగా ఈ ఏడాది మార్చి 19న రద్దయిన లక్నో-న్యూఢిల్లీ(Train No-82501/82502),అహ్మదాబాద్-ముంబై(Train No-82902/82901) తేజాస్ ఎక్స్ప్రెస్ రైళ్లు శనివారం(అక్టోబర్ 17) తిరిగి పట్టాలెక్కనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రయాణికులకు ఐఆర్సీటీసీ స్పష్టమైన మార్గద్శకాలు విడుదల చేసింది. ఈ మార్గదర్శకాలు పాటించే వారిని మాత్రమే రైలు ప్రయాణానికి అనుమతిస్తారు.
Recommended Video
తాజా మార్గదర్శకాల ప్రకారం... రైలు ప్రయాణికులు,సిబ్బంది తప్పనిసరిగా ఫేస్ మాస్కులు ధరించాలి. ప్రయాణికులు ఒక్కసారి తమ సీట్లలో కూర్చొన్న తర్వాత.. వేరే సీట్లలోకి మారడానికి అనుమతించరు. ప్రతీ ప్రయాణికుడు తమ సెల్ఫోన్లో ఆరోగ్య సేతు యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలి. ఒకవేళ ఎవరైనా అధికారులు ప్రశ్నించినప్పుడు ఆ యాప్ను చూపించాల్సి ఉంటుంది.
ప్రయాణికులు టికెట్ తీసుకునే సమయంలోనే ప్రయాణంలో పాటించాల్సిన నియమ నిబంధనలపై వారికి పూర్తి వివరాలు అందజేస్తారు. అలాగే ప్రయాణికులందరికీ కోవిడ్ 19 ప్రొటెక్షన్ కిట్ అందజేస్తారు. అందులో హ్యాండ్ శానిటైజర్స్,ఫేస్ మాస్క్,ఫేస్ షీల్డ్,హ్యాండ్ గ్లవ్స్ ఉంటాయి. రైలు కోచ్లోకి ఎక్కేముందు చేతులను శానిటైజర్తో శుభ్రం చేసుకోవాలి.
రైలు కోచ్లోకి అనుమతించేముందు థర్మల్ స్క్రీనింగ్ చేస్తారు. ఎటువంటి కరోనా లక్షణాలు లేకపోతేనే ప్రయాణానికి అనుమతిస్తారు. రైల్లో ప్యాంట్రీ,టాయిలెట్స్ను ఎప్పటికప్పుడు శానిటైజ్ చేస్తారు. అలాగే ప్రయాణికుల లగేజీని, వాటిని తీసుకెళ్లే ట్రాలీలను కూడా శానిటైజ్ చేస్తారు. ప్రయాణికులు రైల్లో తరుచుగా తాకే ప్రదేశాలను కూడా ఎప్పటికప్పుడు శానిటైజ్ చేస్తారు.
రైలు ప్రయాణంలో పాటించాల్సిన నిబంధనలపై ఇప్పటికే తమ టీమ్స్కు అవసరమైన శిక్షణను అందించినట్లు ఐఆర్సీటీసీ వెల్లడించింది. ప్రయాణికుల భద్రత రీత్యా స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ను తప్పక పాటిస్తామని పేర్కొంది. ఇక శనివారం(అక్టోబర్ 17) నుంచి దుర్గా నవరాత్రులు మొదలవుతున్న నేపథ్యంలో ఐఆర్సీటీసీ తేజాస్ ప్రయాణికులకు రైల్లో పండ్లు కూడా అందించనుండటం విశేషం.
కాగా,లక్నో-ఢిల్లీ మధ్య అక్టోబర్ 4,2019న,ముంబై-అహ్మదాబాద్ మధ్య జనవరి 19,2020న తేజాస్ రైళ్లను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ రెండు రైళ్లు కార్పోరేట్ ఆధ్వర్యంలోనే నడుస్తున్నాయి.