జర్నీ..రీస్టార్ట్: రైల్వేకు ఉన్న సత్తా ఇదీ: వేల టికెట్లు..కోట్ల రూపాయల ఆదాయం: కొన్ని గంటల్లోనే.. !
న్యూఢిల్లీ: భారతీయ రైల్వేలకు ఉన్న సత్తా ఏమిటో మరోసారి నిరూపితమైంది. ఇన్ని రోజుల లాక్డౌన్ తరువాత పరిమితంగానే పట్టాలెక్కబోతున్నప్పటికీ..ప్రయాణికులకు తన అవసరాలేమిటో స్పష్టం చేసింది. కోట్లాదిమంది ప్రజల దైనందిన జీవితంలో భాగమైన రైళ్లలు.. ఈ సాయంత్రానికి పట్టాలెక్కబోతున్నాయి. తన నాన్స్టాప్ జర్నీని రీస్టార్ట్ చేయబోతున్నాయి. వేలమందిని తమ గమ్యస్థానాలకు చేర్చడానికి రెడీ అవుతున్నాయి.
Recommended Video
గంటల్లో వేల టికెట్లు..
న్యూఢిల్లీని కేంద్రబిందువుగా చేసుకుని దేశంలోని అన్ని ప్రధాన నగరాలకు రైళ్ల రాకపోకలను పునరుద్ధరించింది రైల్వే మంత్రిత్వ శాఖ. సోమవారం సాయంత్రం దీనికి సంబంధించిన ఆన్లైన్ టికెట్ల బుకింగ్ను ఆరంభించింది. తెల్లవారే సరికి టికెట్లు దొరకని పరిస్థితి ఏర్పడిందంటే.. వాటికి ఉన్న డిమాండ్ ఏమిటో అర్థం చేసుకోవచ్చు. కొన్ని గంటల వ్యవధిలోనే వేల టికెట్లను విక్రయించింది ఐఆర్సీటీసీ. కొన్ని గంటల్లోనే రికార్డు స్థాయిలో టికెట్లను జారీ చేసింది.
16 కోట్ల ఆదాయం..
సోమవారం సాయంత్రం 6 గంటలకు ఐఆర్సీటీసీ వెబ్సైట్, మొబైల్ యాప్ ద్వారా ఆన్లైన్ టికెట్ల బుకింగ్ ప్రారంభించిన వెంటనే భారీగా అమ్ముడుపోయాయి. తొలిదశలో నడిపించబోతున్న 15 రైళ్లల్లో సీట్లన్నీ గంటల వ్యవధిలో భర్తీ అయ్యాయి. 45,533 పీఎన్ఆర్ నంబర్లను రైల్వేలు జనరేట్ చేశాయి. 82,317 మంది ప్రయాణికులు టికెట్లను కొనుగోలు చేశారు. దీనివల్ల రైల్వే 16,15,63,821 రూపాయలను ఆర్జించింది.
న్యూఢిల్లీ రైల్వేస్టేషన్ వద్ద ప్రయాణికుల రద్దీ..
అన్నింటికంటే.. పశ్చిమ బెంగాల్ వైపు వెళ్లే ప్రయాణికుల తాకిడి అత్యధికంగా కనిపించింది. న్యూఢిల్లీ నుంచి హౌరా వెళ్లే ఎక్స్ప్రెస్ రైలు టికెట్లు పదే పది నిమిషాల్లోనే ఖాళీ అయ్యాయి. ఇదే పరిస్థితి దాదాపు అన్ని ఎక్స్ప్రెస్ సర్వీసుల్లోనూ కనిపించాయి. మొట్టమొదటి రైలు న్యూఢిల్లీ నుంచి బిలాస్పూర్ వెళ్లబోతోంది. ఆ వెంటనే మరిన్ని రైళ్లు తమ గమ్యస్థానాల వైపు పరుగులు పెట్టబోతున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని వేలాదిమంది ప్రయాణికులు న్యూఢిల్లీ రైల్వేస్టేషన్కు చేరుకుంటున్నారు.
సోషల్ డిస్టెన్సింగ్..
ప్రయాణికుల రద్దీతో రైల్వేస్టేషన్ నిండిపోయింది. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండటానికి రైల్వే అధికారులు సోషల్ డిస్టెన్సింగ్ను పాటిస్తున్నారు. ప్రతి ప్రయాణికుడి మధ్య నాలుగు అడుగుల దూరం ఉండేలా ముందుజాగ్రత్త చర్యలు తీసుకున్నారు. ప్రతి ఒక్కరికీ వైద్య పరీక్షలు, థర్మల్ స్క్రీనింగ్ నిర్వహించిన తరువాతే ప్లాట్ఫాంపైకి అడుగు పెట్టేలా చేస్తున్నారు. దీనితో రైల్వేస్టేషన్ బయట ప్రయాణికులు బారులు తీరి నిల్చున్నారు.