తత్కాల్ టిక్కెట్ల బుకింగ్కు కొత్త రూల్స్: 3 గంటలు రైలు ఆలస్యమైతే ఛార్జీ వాపస్
న్యూఢిల్లీ: తత్కాల్ టిక్కెట్ల బుకింగ్ కోసం ఇండియన్ రైల్వే శాఖ కొత్త రూల్స్ను అమల్లోకి తీసుకురానుంది. నూతనంగా ప్రవేశపెట్టనున్న తత్కాల్ నిబంధనల వల్ల టిక్కెట్టు రిజర్వేషన్ విధానాన్ని మరింత బలోపేతం చేసేందుకు వీలు కానుందని రైల్వేశాఖాధికారులు అభిప్రాయపడుతున్నారు.
ఇక మీదట ఒక యూజర్ ఐడీ నుండి నెలలో కేవలం 6 టిక్కెట్లు బుక్ చేసుకొనే వీలుంది. ఆధార్ కార్డు ఉపయోగించి టిక్కెట్లు బుక్ చేసుకొనే వారు 12 టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చు. ఉదయం 8 గంటల నుండి 10 గంటల మధ్య మాత్రమే బుక్ చేసుకొనేందుకు వీలుందని రైల్వే అధికారులు చెబుతున్నారు.
ఒక్క యూజర్ ఒక్క లాగిన్ సెషన్ మాత్రమే అందుబాటులో ఉండనుంది,. యూజర్ లాగిన్ అయ్యే సమయంలో ప్రయాణికుడి వివరాలు పేమెంట్ పేజీతో పాటు క్యాప్చా కూడ అందుబాటులో ఉంటుంది.
ప్రయాణికుల వ్యక్తిగత ప్రశ్నలు కూడ అడగనున్నారు. ఏజంట్లు మొదటి 30 నిమిషాల పాటు తత్కాల్ టిక్కెట్లు బుక్ చేసుకొనే వీలు లేకుండా చేశారు. తత్కాల్ టిక్కెట్ల బుకింగ్ కోసం కూడ నిర్ణీత సమయాన్ని కేటాయించనున్నారు.
తత్కాల్ టిక్కెట్ల బుకింగ్ కోసం డబ్బు చెల్లింపు కోసం 10 సెకన్ల సమయాన్ని కేటాయించారు. ఏసీ కోచ్ల్లో బెర్తుల కోసం ఉదయం 10 గంటలకు, స్లీపర్ క్లాసుల్లో బెర్తులు బుక్ చేసుకోవాలనుకొనేవారు ఉదయం 11 గంటల సమయంలో బుక్ చేసుకోవాల్సి ఉంటుంది.
రైలు నిర్ధేశించిన సమయాని కంటే 3 గంటలు ఆలస్యంగా బయలుదేరితే పూర్తి చార్జీలు, తత్కాలు ఛార్జీలు ప్రయాణీకుడికి చెల్లిస్తారు. రైలు మార్గం మళ్ళించినా, ప్రయాణీకులు ప్రయాణాన్ని వాయిదా వేసుకొన్నా వారికి పూర్తిగా ఛార్జీలు తిరిగి చెల్లిస్తారు.ఫస్ట్ క్లాసులో టిక్కెట్టు బుక్ చేసుకొని సెకండ్ క్లాస్ లేదా జనరల్ కు టిక్కెట్టును మార్చుకొంటే ఛార్జీల మధ్య ఉన్న తేడాను ప్రయాణికుడికి తిరిగి చెల్లిస్తారు.