రైలు ఆలస్యమైనందుకు.. ప్రయాణికులకు పరిహారం చెల్లించనున్న ఐఆర్సీటీసీ
ఇండియన్ రైల్వే కేటరింగ్&టూరిజం కార్పోరేషన్(IRCTC)ఆధ్వర్యంలో నడుస్తున్న అహ్మదాబాద్-ముంబై తేజాస్ రైలు బుధవారం గంటన్నర ఆలస్యంగా ముంబైకి చేరుకుంది. దీనిపై విచారం వ్యక్తం చేసిన ఐఆర్సీటీసీ.. రైల్లోని 630 ప్రయాణికులకు రూ.100 చొప్పున పరిహారం చెల్లించనున్నట్టు చెప్పింది. ఐఆర్సీటీసీ రీఫండ్ పాలసీ ప్రకారం ప్రయాణికులు పరిహారం కోసం దరఖాస్తు చేసుకోవాలని.. వెరిఫికేషన్ అనంతరం ఆ డబ్బు వారికి అందుతుందని సంస్థ ప్రతినిధి ఒకరు తెలిపారు.
రైల్వే అధికారుల సమాచారం ప్రకారం.. తేజాస్ రైలు అహ్మదాబాద్లో రెండు నిమిషాలు ఆలస్యంగా 6.42గంటలకు కదిలింది. షెడ్యూల్ ప్రకారం 1.10గంటలకు ముంబై చేరుకోవాల్సి ఉండగా.. గంటన్నర ఆలస్యంగా 2.36గంటలకు అక్కడికి చేరుకుంది. ముంబై శివారులోని భయందర్-దహిసర్ స్టేషన్ల మధ్య తలెత్తిన సాంకేతిక సమస్యతోనే రైలు ఆలస్యమైనట్టు అధికారులు తెలిపారు. దీని కారణంగా తేజాస్తో పాటు మరికొన్ని సబర్బన్,ఔట్ స్టేషన్ రైళ్లు కూడా ఆలస్యంగా నడిచినట్టు చెప్పారు. దాదాపు 8 సబర్బన్ రైళ్లను రద్దు చేసినట్టు చెప్పారు.
కాగా,ఐఆర్సీటీసీ నిబంధనల ప్రకారం.. తేజాస్ రైలు గంట ఆలస్యమైతే రూ.100,రెండు గంటలు ఆలస్యమైతే రూ.250 చెల్లిస్తారు. ఐఆర్సీటీసీ ఏర్పాటు చేసిన ఫోన్ నంబర్ 18002665844కు కాల్ చేయడం ద్వారా లేదా [email protected] మెసేజ్ చేయడం ద్వారా పరిహారాన్ని పొందవచ్చు.
ఇదిలా ఉంటే, దేశంలో తొలి ప్రైవేట్ రైలుగా లక్నో-ఢిల్లీ మధ్య నడిచే తేజాస్ ఎక్స్ప్రెస్ విజయవంతమైన నేపథ్యంలో.. ఐఆర్సీటీసీ ఆధ్వర్యంలో ప్రైవేట్ ఆపరేటర్ అహ్మదాబాద్-ముంబై రూట్లో రెండో తేజాస్ ట్రైన్ పట్టాలెక్కింది. అహ్మదాబాద్-ముంబై మార్గంలో గత శుక్రవారమే కేంద్ర రైల్వే మంత్రి పీయూష్ గోయల్, గుజరాత్ సీఎం విజయ్ రూపానీలు పచ్చ జెండా ఊపి ప్రారంభించారు.