అంతులేని వ్యథ..: నా భార్య కనిపిస్తే చెప్పరా ప్లీజ్!..
న్యూఢిల్లీ: మానసిక ఒత్తిడిని అధిగమించడానికి చికిత్స కోసం ఇండియా వచ్చిన లిగ స్క్రోమనే(33) అనే ఓ ఐరిష్ మహిళ ఆచూకీ తెలియకుండా పోయింది. లిగను వెతుక్కుంటూ ఇండియా వచ్చిన ఆమె భర్త ఆండ్రూ జోర్డాన్.. ఆమె కోసం తీవ్రంగా గాలిస్తున్నారు.
ఇప్పటికీ మూడు వారాలు గడిచిపోయినా.. ఆమె ఆచూకీ మాత్రం తెలియరాలేదు. ఆమె ఎక్కడో ఓ దగ్గర జీవించే ఉంటుంది కానీ విపత్కర పరిస్థితుల్లో ఉండి ఉంటుందని ఆండ్రూ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.
తన భార్య అదృశ్యం పట్ల ఇక్కడి పోలీసులకు ఫిర్యాదు చేసినా లాభం లేకపోయిందని.. వాళ్లు తన భార్య కోసం వెతుకుతారన్న నమ్మకం కూడా పోయిందని ఆండ్రూ చెబుతున్నాడు.
కాగా, లాత్వియాలోని డబ్లిన్కు చెందిన లిగ స్క్రోమనే గతేడాది అగస్టు నుంచి మానసిక రుగ్మతతో బాధపడుతున్నారు. ఆత్మహత్యాయత్నానికి కూడా పాల్పడ్డ లిగ.. అప్పటినుంచి మానసికంగా మరింత సతమతమవుతున్నారు.
ఈ నేపథ్యంలోనే ఫిబ్రవరి 4న ఆయుర్వేద చికిత్స కోసం ఆమె తన సోదరి ఇల్జే స్క్రోమనేతో కలసి కేరళలోని తిరువనంతపురం వచ్చిందని ఆండ్రూ చెబుతున్నాడు. అక్కడ ఆరువారాల పాటు ఆమె సంపూర్ణ ఆయుర్వేద చికిత్స తీసుకోవాలనుకున్నట్టు తెలిపారు.
మార్చి 14వ తేదీన ఆమె చికిత్స కేంద్రాన్ని వీడి బయటకు వచ్చిందని.. ఆ తర్వాత ఆమె కనిపించకుండా పోయిందని చెబుతున్నాడు. చివరిసారిగా ఆమె కోవలం బీచ్ వద్ద కొంతమందితో మాట్లాడినట్టు తెలిసిందని పేర్కొన్నాడు. తన పాస్ పోర్టు, ఫోన్.. రెండూ రిసార్టులోనే వదిలేసినట్టు తెలిపాడు.
ఈ నేపథ్యంలో మార్చి 17వ తేదీన ఆమె ఆచూకీ వెతుక్కుంటూ తాను ఇండియా వచ్చినట్టు ఆండ్రూ చెప్పాడు. అయితే ఇక్కడి పోలీసుల తీరు చూసి తాను అసంతృప్తికి లోనయ్యానని అన్నాడు.
'పోలీస్ అధికారిని సంప్రదించినప్పుడు.. అన్ని రకాలుగా దర్యాప్తు కొనసాగుతోందని చెప్పారు. కానీ విచారణపై నేను కొన్ని ప్రశ్నలు అడిగేసరికి.. వారి దర్యాప్తులో పస లేదన్న సంగతి తెలిసిపోయింది. ఆమె ఏదో హాలీడే ట్రిప్ కోసం వెళ్లినట్టు.. తిరిగి తనే వస్తుందని వారు భావిస్తున్నట్టు నాకు అర్థమైంది' అని ఆండ్రూ మీడియాతో వెల్లడించాడు.
'కేవలం సీసీటీవి ఫుటేజీని పరిశీలించడానికే పోలీసులకు రెండు వారాలు పట్టింది. అది కూడా లాత్వియా, ఐరిష్ రాయబార కార్యాలయాల నుంచి ఒత్తిడి వస్తే తప్ప పని జరగలేదు. ఇక్కడి విదేశాంగ శాఖ మంత్రితో అక్కడి అధికారులు మాట్లాడి దీని గురించి చర్చించారు' అని తెలిపాడు.
'గతవారం లేదా అంతకన్నా ముందు.. పోలీసులు అందరికీ ఒకటే చెబుతూ వచ్చారు. వీలైనంత మేర తాము దర్యాప్తు కొనసాగిస్తున్నామని, ఇప్పటికే 300మందిని విచారించామని, కానీ ఎటువంటి లాభం లేకపోయిందని చెప్పారు. కానీ ఇవేవి నిజం కాదు, వాళ్లు ఇప్పుడిప్పుడే కేసుపై నిజంగా దృష్టి సారిస్తున్నారు. అంతకుముందు కేసుకు సంబంధించి నేను చెప్పిన విషయాలేవి వారు పట్టించుకోలేదు' అని వాపోయాడు.
భారతీయ అధికారులను విమర్శించడానికి నేను ఇలా మాట్లాడట్లేదు. కానీ ప్రాథమిక దర్యాప్తులో వారు విఫలమయ్యారని ఆండ్రూ ఆరోపించారు. ఇప్పటికైనా వారు మారుతారని తాను నమ్ముతున్నానని, కేసుపై సీరియస్ గా విచారణ జరుపుతారని ఆశిస్తున్నాని అన్నారు.
'ఇదేదో నాటకంలా భావించి తొలుత వారు విచారణే చేపట్టలేదు. రెండు వారాల పాటు అలాగే చేశారు. లిగను ఎవరైనా కిడ్నాప్ చేసి ఉంటారేమో అని చెబితే.. వారు బిగ్గరగా నవ్వారు' అని తనకు ఎదురైన అవమానాన్ని ఆండ్రూ గుర్తుచేసుకున్నారు.
గత రెండున్నర వారాలుగా నిమ్మకు నీరెత్తినట్టుగా ఉన్న పోలీసులు.. ఇప్పుడిప్పుడే విచారణ మొదలుపెట్టారని అన్నారు. లిగ ఆచూకీ కోసం తాను ఇప్పటికే 5000పోస్టర్లు ముద్రించానని, దాదాపు 10వేల మందితో మాట్లాడానని ఆండ్రూ చెప్పారు. మీడియా, పోలీసులు కూడా ఇందుకు సహకరించాలని కోరారు.
'భారతీయ మీడియా అసలు దీన్ని పట్టించుకోవట్లేదు. ఈ విషయంపై చాలా దినపత్రికల్లో వార్తలు వచ్చాయి. కానీ ఎక్కడా 'లిగ' ఫోటోను వారు సరిగ్గా ప్రచురించలేదు. కనీసం ఫోన్ నంబర్ కూడా పేర్కొనలేదు' అని వాపోయాడు.
భారతదేశ ప్రధాన ఆదాయ వనరుల్లో టూరిజం ఒకటి. అలాంటిది ఓ టూరిస్ట్ ఇండియా వచ్చి తప్పిపోతే.. ఇక్కడి మీడియా, పోలీసులు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడమేంటి అని ఆండ్రూ ప్రశ్నిస్తున్నాడు.
'ఆమె ఎక్కడైతే కనిపించకుండా పోయిందో.. ఆ పోలీస్ స్టేషన్ పరిధిలోనే కాకుండా చుట్టుపక్కల స్టేషన్లను కూడా అప్రమత్తం చేసినట్టు పోలీసులు చెప్పారు. కానీ అక్కడికి 3,4కి.మీ దూరంలోని ఓ పోలీస్ స్టేషన్కు శనివారం నేను వెళ్తే.. వాళ్లకు ఆ కేసు గురించి అప్పటిదాకా కనీస సమాచారం కూడా లేదని తెలిసింది.
తన భార్య ఆచూకీ కోసం విరాళాల సేకరణ ద్వారా రివార్డు కూడా ప్రకటించాడు ఆండ్రూ. తానేమి ధనవంతుడిని కాదని, అయినా సరే ఆమెను వెతకడం కోసం వీలైనన్ని మార్గాల్లో అన్వేషిస్తూనే ఉంటానని తెలిపాడు.
'నా భార్య ఆచూకీ కోసం మొదట నా సోదరి 1400యూరోల రివార్డు ప్రకటించింది. ఈ రివార్డు ఐర్లాండ్ లో ఒక ఏడాది వేతనంతో సమానం. అయినా సరే మేము వెనక్కి తగ్గలేదు.' అని ఆండ్రూ చెప్పాడు. ఆ తర్వాత కేసు విషయమై డీజీపీని సంప్రదించగా.. రివార్డును 2వేల యూరోలకు పెంచినట్టు తెలిపాడు.
ఇండియాలోని ఐర్లాండ్ కమ్యూనిటీ ప్రజలు ఆమె ఆచూకీ తెలిస్తే చెప్పాలని కోరుతున్నాడు. తన స్నేహితుల సలహా మేరకు రివార్డును మరింత పెంచామని, మీడియా ఎటెన్షన్ కావాలనుకుంటున్నామని తెలిపాడు.
లిగ ఆచూకీ కోసం ప్రస్తుతం తాము 10లక్షల రూపాయల రివార్డు ప్రకటించినట్టు తెలిపాడు. అంత డబ్బు తన వద్ద లేకపోయినా.. విరాళాల సేకరణ ద్వారా ఆ రివార్డు డబ్బు సేకరించాలని భావిస్తున్నాడు. ఏదైనా గ్యాంగ్ ఆమెను కిడ్నాప్ చేసి ఉంటుందని తాను అనుమానిస్తున్నట్టు ఆండ్రూ తెలిపాడు.
కాగా, లిగను ఆండ్రూ ఐదేళ్ల క్రితం కోర్క్ నగరంలో కలుసుకున్నాడు. అప్పటినుంచి డబ్లిన్ నగరంలో వీరిద్దరు సహజీవనం చేస్తున్నారు. ఆమె చాలా సున్నితమైన వ్యక్తి అని, మృధు స్వభావి అని, మానసిక రుగ్మతలతో బాధపడుతోందని, ఆమె కోసం వెతుకుతూనే ఉంటానని ఆవేదన చెందుతున్నాడు.
-ఈ ఆర్టికల్ చదివిన తర్వాత లిగ గురించి మీకేదైనా సమాచారం తెలిసినట్టు అనిపిస్తే ఈ నంబర్ 116 123 ద్వారా సమరిటన్స్ సంస్థను సంప్రదించండి.