ఫ్లైట్లో ఆమె మందేసి, చిందేసి.. జైలుపాలైంది..! కాని.. వచ్చి రాగానే..!
న్యూఢిల్లీ : ఆమె ఇంగ్లాండ్కు చెందిన ప్రముఖ న్యాయవాది. వయసు 50 ఏళ్లు.. దీంతోపాటు ఆమె అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థ లాయర్ కూడా. కానీ ఇంటర్నేషనల్ ఫ్లైట్లో మందేసి చిందేసింది. సిబ్బందిపై దురుసుగా ప్రవర్తించడంతో .. ఎంతవారికైనా అన్నట్టు ఆమెను జైలులో వేశారు. ఇంటికి తిరిగొచ్చిందో లేదో .. అనంతలోకాలకు వెళ్లిపోయంది.
మత్తుకోసం హంగామా ..
ఇంగ్లాండ్కు చెందిన సిమోన్ బర్స్న్ (50) అంతర్జాతీయ మానవహక్కుల అడ్వకేట్. మంచి ప్రొఫెషన్లో ఉన్నారు. నలుగురికి మంచి చెప్పాలని ఆమె తప్ప తాగి అల్లరి చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ముంబై నుంచి లండన్ వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానంలో ప్రయాణిస్తున్నారు. అయితే ఆమె అప్పటికే ఫూటుగా మద్యం సేవించారు. మూడు పెగ్గుల మందు తాగిన సరిపోలేదో ఏమో .. ఇంకా మందు కావాలని అడిగారు. అందుకు సిబ్బంది అంగీకరించలేదు. దీంతో సిమోన్ స్టాఫ్తో గొడవపడ్డారు. వైన్ ఇవ్వాలని అల్లరి చేశారు. దీంతో వారు ఎయిర్ ఇండియా ఫ్లైట్ కమాండర్ దృష్టికి విషయాన్ని తీసుకెళ్లారు. అంతకన్నా ఎక్కువ మందు ఇచ్చేందుకు అంగీకరించకపోవడంతో .. సిబ్బంది ఆమెకు వైన్ ఇచ్చేందుకు నిరాకరించారు.
తిట్లపురాణం ..
వైన్ ఇవ్వకపోవడంతో సిమోన్ కోపం నశలానికి ఎక్కింది. కనిపించిన సిబ్బందిని అసభ్యపదజాలంతో దూషించారు. మీ దేశం అంతా ధనిక దేశమా ? అని నోరుజారారు. సిబ్బందిని మత్తులో నోటికొచ్చినట్టు దుర్భాషలాడారు. అంతేకాదు తాను అంతర్జాతీయ మానవహక్కుల లాయర్నని చెప్పుకున్నారు. పాలస్తీనా ప్రజలను కాపాడింది తనేనని బీరాలు పలికారు. తనకే మందు ఇవ్వరా అంటూ తిట్ల వర్షం కురిపించారు. తర్వాత క్యాబిన్లో సిగరేట్ తాగేందుకు ప్రయత్నించారు. వద్దు అని చెప్పినా సిబ్బందిపై ఉమ్మి తన తలపొగరు వ్యక్తం చేశారు. విమానంలో నానా హంగామా చేసిన మహిళను .. లండన్లో విమానం దిగగానే సిబ్బంది విషయాన్ని అక్కడి పోలీసులకు తెలిపారు. వెంటనే ఆమెను అరెస్ట్ చేసి పోలీసుస్టేషన్కు తరలించారు.
ఆర్నెల్ల జైలు ..
విమానంలో హంగామాకు సంబంధించి పక్కా ఆధారాలు సమర్పించడంతో .. ఆమెకు అక్కడి కోర్టు ఆరునెలల జైలుశిక్ష విధించింది. అయితే జైలు నుంచి విడుదలై ఇంటికొచ్చింది. తర్వాత విగతజీవిగా కనిపించడం కలకలం రేపింది. సిమోన్ మృతదేహాన్ని పరిశీలించిన పోలీసులు .. ఆమె ఆత్మహత్య చేసుకుందని ప్రాథమికంగా తెలిపారు. హత్య చేసినట్టు శరీరంపై ఎలాంటి గాయాలు లేవని స్పష్టంచేశారు.