భర్తను వదిలి ప్రియుడితో సహజీవనం: వాసన వస్తోందన్నందుకు చంపేశాడు
పాట్నా: బీహార్ రాష్ట్రంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. 'నీ శరీరం నుంచి దుర్వాసన వస్తుంది' అంటూ తరచూ చెప్తున్న మహిళను ఆమె ప్రియుడు గొంతునులిమి చంపేశాడు. ఈ ఘటన పాట్నాలోని బిషున్పూర్లో జరిగింది.
ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. 2006లో వివాహమైన నిభా(25).. తన భర్త నుంచి విడిపోయి తన ప్రియుడు భోలాతో సహజీవనం చేస్తోంది. ఆమెకు ఏడేళ్ల కూతురు కూడా ఉంది. కాగా, 'నీ శరీరం నుంచి దుర్వాసన వస్తోంది' అని భోలాకు తరచూ నిభా చెప్తుండేది.
ఈ విషయంపై ఇద్దరి మధ్య పలుమార్లు గొడవలు కూడా జరిగాయి. 'నీ నుంచి వచ్చే కంపు భరించలేక పోతున్నా' అంటూ తరచూ చెబుతుండటంతో ఆగ్రహానికి గురైన భోలా శనివారం ఆమె గొంతు నులుమి చంపి మంచంపై పడేసి పరారయ్యాడు.
కాగా, ఆ గదిలో నుంచి మృతదేహం వాసన వస్తుండటంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసు గది తలుపు పగులగొట్టి మృతదేహాన్ని స్వాధీనం చేసుకొన్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడు భోలాను అదుపులోకి తీసుకుని, విచారిస్తున్నట్లు తెలిపారు.