20 ఏళ్ల తర్వాత.. మళ్లీ ఓటేసిన మణిపూర్ ఉక్కుమహిళ
మణిపూర్ ఉక్కుమహిళ ఇరోమ్ చాను షర్మిల ఇరవై ఏళ్ల తరువాత మళ్లీ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఇంఫాల్: మణిపూర్ ఉక్కుమహిళ ఇరోమ్ చాను షర్మిల ఇరవై ఏళ్ల తరువాత మళ్లీ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో షర్మిల ఇటీవలే రాజకీయ ఆరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే.
ఆరోజు మణిపూర్ అసెంబ్లీకి తొలి దశ ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం 60 సీట్లలో ఈరోజు 38 నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతోంది. ఈ పోరాట యోధురాలు.. తాను స్థాపించిన పీపుల్స్ రిసర్జెన్స్ అండ్ జస్టిస్ అలయన్స్(పీఆర్జేయే) పార్టీ నుంచి ముగ్గురు అభ్యర్థలను బరిలో ఉంచారు. ప్రజలు మార్పును కోరుకుంటున్నారని.. మణిపూర్ లో అలాంటి మార్పు తీసుకురాగలమని ఆమె పేర్కొన్నారు.
యువతరం నుంచి కూడా సానుకూల స్పందన వస్తోందని, మార్చి 8 జరిగే ఎన్నికల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి పోటీ చేస్తున్న ఖంగాబాక్ నియోజకవర్గంలో తాము విజయం సాధించి తీరుతామన్నారు.
పౌరహక్కుల కార్యకర్తగా నిరంతర పోరాటం సాగిస్తున్న షర్మిల 2000 సంవత్సరం నవంబర్ 2న నిరాహార దీక్ష ప్రారంభించి పదహారేళ్ల పాటు కొనసాగించారు. ఎలాంటి ఆహారం, నీరు తీసుకోకుండా 500 వారాలపాటు సుదీర్ఘ నిరాహార దీక్ష చేసిన ఉద్యమకారణిగా చరిత్ర సృష్టించారు. ఎట్టకేలకు గత ఏడాది ఆగస్టు 9న నిరాహార దీక్ష విరమించిన షర్మిల రాజకీయ పార్టీని స్థాపించి మరో పోరాటానికి సిద్ధమయ్యారు.