మదర్స్ డే రోజు కవలలకు జన్మనిచ్చిన ఐరెన్ లేడీ
బెంగళూరు : మణిపూర్ ఐరన్ లేడీ ఇరోమ్ షర్మిల తల్లయ్యారు. మాతృదినోత్సవం రోజున ఆమె కవలలకు జన్మనిచ్చారు. బెంగళూరులోని క్లౌడ్ నైన్ హాస్పిటల్లో ఆమె ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చినట్లు షర్మిల సన్నిహితురాలు దివ్యభారతి ఫేస్బుక్ పేజీలో ప్రకటించారు. తల్లీబిడ్డలు క్షేమంగా ఉన్నట్లు చెప్పారు. 16ఏళ్ల దీక్ష విరమణ అనంతరం కొడైకెనాల్లో స్థిరపడ్డ షర్మిల.. ప్రెగ్నెన్సీ కోసం గతేడాది బెంగళూరుకు షిఫ్ట్ అయ్యారు. షర్మిల తన కవల పిల్లలకు నిక్స్ సఖి, ఆటమ్ తారా అని పేర్లు పెట్టారు.
మణిపూర్లో పౌరహక్కుల కోసం సుదీర్ఘ పోరాటం చేసిన షర్మిల 2017 ఆగస్టులో బ్రిటీష్ బాయ్ ఫ్రెండ్ డేస్మోండ్ ఆంథోని బెల్లర్మిన్ను వివాహం చేసుకున్నారు. హిందూ మ్యారేజ్ యాక్ట్ కింద రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవాలని భావించినా డేస్మోండ్ బ్రిటీష్ పౌరుడైనందున నిబంధనలు ఒప్పుకోలేదు. దీంతో స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ 1954కింద వారు వివాహం చేసుకున్నారు. పెళ్లి అనంతరం వారు కొడైకెనాల్లోనే స్థిరపడ్డారు.
మణిపూర్లో భద్రతా దళాలకు ప్రత్యేక అధికారం అందించే చట్టాన్ని రద్దు చేయాలంటూ ఇరోమ్ షర్మిళ 16ఏళ్ల పాటు సుదీర్ఘ పోరాటం చేశారు. ఆ సమయంలో నాజల్ ట్యూబ్ ద్వారా కేవలం ద్రవ పదార్థాలను మాత్రమే ఆహారంగా తీసుకున్నారు. 2016లో దీక్ష విరమించిన అనంతరం రాజకీయ పార్టీ స్థాపించిన ఆమె ఎన్నికల్లో పోటీ చేశారు. అయితే ప్రజల మద్దతు లేకపోవడంతో కేవలం 90ఓట్లు సాధించి ఘోర పరాజయం పాలయ్యారు. ప్రజలు తనను తిరస్కరించినందున మణిపూర్ను వదిలిపెట్టిన షర్మిల.. కొడైకెనాల్లో స్థిరపడాలని నిర్ణయించుకున్నారు.