‘మార్పు కోసం పది రూపాయలు’.. షర్మిల పార్టీ కోసం ఆన్ లైన్ క్రౌడ్ ఫండింగ్!
ఎన్నికల ప్రచారం కోసం మణిపూర్ ఉక్కు మహిళ ఇరోమ్ షర్మిల పార్టీ పీఆర్జేయే వినూత్న ఒరవడికి శ్రీకారం చుట్టింది. ప్రజల నుంచి ఆన్ లైన్ లో విరాళాలు( క్రౌడ్ ఫండింగ్) సేకరించాలని నిర్ణయించింది.
ఇంఫాల్: ఎన్నికల ప్రచారం కోసం మణిపూర్ ఉక్కు మహిళ ఇరోమ్ షర్మిల వినూత్న ఒరవడికి శ్రీకారం చుట్టారు. తాను స్థాపించిన పీఆర్జేయే పార్టీకి ప్రజల నుంచి ఆన్ లైన్ లో విరాళాలు( క్రౌడ్ ఫండింగ్) సేకరించాలని నిర్ణయించారు.
''మార్పు కోసం పది రూపాయలు''(టెన్ ఫర్ చేంజ్) నినాదంతో చేపడుతున్న ఈ కార్యక్రమం.. తమను ప్రజలకు మరింత చేరువ చేస్తుందని ఆ పార్టీ భావిస్తోంది. తమ ఎన్నికల ప్రచారంలో ప్రజలు కూడా భాగస్వాములని పార్టీ పేర్కొంటోంది.
ఎన్నికల ఖర్చులో పారదర్శకతను తీసుకొచ్చేందుకు క్రౌడ్ ఫండింగ్ విధానాన్ని ఎంచుకున్నట్లు పీఆర్జేయే పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఎన్నికల కోసం ప్రజల నుంచి ఈ తరహాలో విరాళాలు సేకరించిన తొలి ప్రాంతీయ పార్టీ కూడా పీఆర్జేయే కావడం విశేషం.
దీంతోపాటు ప్రజలకు మరింత చేరువయ్యే విధంగా సైకిల్ నడుపుతూ ప్రచారం చేయాలని షర్మిల నిర్ణయించారు. ఇందులో భాగంగా పార్టీ అభ్యర్థులంతా సైకిళ్లపై ప్రచారం చేయనున్నట్లు పీఆర్జేయే వెల్లడించింది.