బాధ్యతారాహిత్యంతో 441మందికి కరోనా లక్షణాలు: ‘మర్కజ్’పై అరవింద్ కేజ్రీవాల్
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో గత రెండ్రోజుల్లోనే కరోనా కేసులు అత్యధికంగా పెరిగాయని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. ఇప్పటి వరకు ఢిల్లీ 97 కేసులు నమోదైనట్లు తెలిపారు. వీరిలో 41 మంది విదేశాల నుంచి వచ్చినవారేనని స్పష్టం చేశారు.
441 మందికి కరోనా..
మంగళవారం అరవింద్ కేజ్రీవాల్ మీడియాతో మాట్లాడుతూ.. 24 మంది కరోనా బాధితులు మర్కజ్ సమావేశంలో పాల్గొన్నారని, మర్కజ్ భవనం నుంచి 1548 మందిని బయటకు తీసుకొచ్చామని తెలిపారు. వారిలో 441 మందికి కరోనా లక్షణాలున్నాయని సీఎం కేజ్రీవాల్ వెల్లడించారు. ప్రస్తుతం వారంతా ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారని తెలిపారు.
నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యమే..
మొత్తం 1107 మందిని మర్కజ్ భవనం నుంచి క్వారంటైన్ తరలించామని చెప్పారు. కరోనావైరస్ వేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో మర్కజ్ భవనంలో ఇంత మంది గుంపుగా చేరడం చాలా నిర్లక్ష్యమైన, బాధ్యతారాహిత్యమైన చర్య అని అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. మర్కజ్ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని లెఫ్టినెంట్ గవర్నర్కు లేఖ రాశామని తెలిపారు.
కఠిన చర్యలంటూ హెచ్చరిక
అన్ని ప్రార్థనా మందిరాల వద్ద గుంపుగా చేరడాన్ని నిషేధించినప్పటికీ.. ఈ విధంగా ఒకే దగ్గరికి ఇలా చేరడం ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించడమేనని సీఎం వ్యాఖ్యానించారు. కరోనా నేపథ్యంలో ఏ మతానికి చెందినవారైనా గుంపులుగా చేరవద్దని కోరారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
మర్కజ్కు పలు రాష్ట్రాల నుంచి.. తెలంగాణలో నలుగురు మృతి
ఇటీవల మర్కజ్ మసీదు ప్రాంతంలో 2వేల మందికిపైగా వివిధ రాష్ట్రాలు, దేశాలకు చెందినవారు చేరి ప్రార్థనలు చేయడంతోపాటు సమావేశం నిర్వహించారు. విదేశాలకు చెందిన వారికి కరోనా వ్యాధి సోకి ఉండటంతో వీరిలో పలువురికి వ్యాపించింది. ఏపీ, తెలంగాణ నుంచి కూడా ఈ కార్యక్రమానికి 200కిపైగా హాజరుకావడం గమనార్హం. ఇప్పటికే ఈ సమావేశంలో పాల్గొన్న తెలంగాణకు చెందిన నలుగురు మృతి చెందిన విషయం తెలిసిందే. సమావేశంలో పాల్గొన్న దేశంలోని పలు రాష్ట్రాలకు చెందిన వారికి కూడా కరోనా పాజిటివ్ రావడం గమనార్హం.