అధికారం లేదు: యడ్యూరప్పతో సహ 104 మంది సామూహిక రాజీనామాలు, మళ్లీ ఎన్నికలు!
బెంగళూరు: కర్ణాటకలో బీజేపీ అధికారంలోకి రావడానికి ఆ పార్టీ నాయకులు చిట్టచివరి ప్రయత్నాలు చేసి విఫలం అయ్యారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన 13 మంది ఎమ్మెల్యేలను ఆపరేషన్ కమల ద్వారా బీజేపీలోకి చేర్చుకోవడానికి చివరి వరకూ ప్రయత్నాలు చేసి విఫలం అయ్యారు. కర్ణాటకలో కాంగ్రెస్, జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు కాకుండా చెయ్యాలని, యడ్యూరప్పతో సహ 104 మంది సామూహిక రాజీనామాలు చెయ్యాలని బీజేపీ నిర్ణయించింది.
మంత్రి పదవులు
కర్ణాటకలో బీజేపీ అధికారంలోకి రావడానికి సహకరించి ఓటింగ్ దూరంగా ఉంటే ఎమ్మెల్యేలు అందరికీ మంత్రి పదవులతో పాటు అనేక తాయిలాలు ఇస్తామని బీజేపీ హామీ ఇచ్చిందని సమాచారం. అయితే యడ్యూరప్ప బలపరీక్ష కు ముందే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు హ్యాండ్ ఇచ్చారు.
సీఎం చేతిలో లేఖ
కాంగ్రెస్ పార్టీకి చెందిన 13 మంది శాసన సభ్యులు బీజేపీ ప్రభుత్వానికి హ్యాండ్ ఇచ్చారు. యడ్యూరప్ప అసెంబ్లీలో ప్రసంగించడానికి వెంట తీసుకెళ్లిన 13 పేజీలతో పాటు రాజీనామా లేఖ వెంట పెట్టుకుని వెళ్లారు. చివరికి రాజీనామా చేసిన యడ్యూరప్ప అసెంబ్లీ నుంచి వెళ్లిపోయారు.
సంచలన నిర్ణయం
కర్ణాటకలో అన్ని పార్టీల కంటే అధికంగా 104 ఎమ్మెల్యే సీట్లు వచ్చినా అధికారంలో రాలేకపోయామని బీజేపీ నాయకులు ఆవేదన చెందుతున్నారు. కర్ణాటకలో అధికారంలోకి రాకపోవడంతో బీఎస్ యడ్యూరప్పతో సహ 104 మంది బీజేపీ ఎమ్మెల్యేలు రాజ్ భవన్ చేరుకుని గవర్నర్ వాజుబాయ్ వాలాకు సామూహిక రాజీనామా లేఖలు ఇవ్వాలని నిర్ణయించారు.
మోడీ, అమిత్ షా ప్లాన్
కర్ణాటకలో 222 శాసన సభ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ప్రస్తుతం 221 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. హెచ్.డి. కుమారస్వామి రెండు స్థానాల్లో విజయం సాధించారు. 104 మంది ఎమ్మెల్యేలు ఉన్న బీజేపీ అవిశ్వాస తీర్మాణంలో గెలవలేదని తెలిసి యడ్యూరప్ప ప్రమాణస్వీకారానికి ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్ షా రాలేదని సమాచారం.
కేంద్రం చేతికి అస్త్రం
బీఎస్ యడ్యూరప్ప బలపరీక్షకు ముందే రాజీనామా చేశారు. కాంగ్రెస్, జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటును ఎవ్వరూ అడ్డుకోలేరు. ఆరు నెలల్లో మళ్లీ ఎన్నికలు జరగాలంటే బీజేపీకి చెందిన 104 మంది ఎమ్మెల్యేలు సామూహిక రాజీనామాలు చెయ్యాలని నిర్ణయించారు. రూ. వందల కోట్లు ప్రజల డబ్బు ఖర్చు పెట్టి జరిగిన ఎన్నికలు రద్దు అయ్యి మళ్లీ ఎన్నికలు జరగడానికి కారణం అయితే బీజేపీని ప్రజలు ఆదరిస్తారా అనే విషయం వేచిచూడాలి.