పౌరసత్వ సవరణ బిల్లుతో హిందువులు ముస్లింల మధ్య చిచ్చుకు ప్రయత్నం: శివసేన
ముంబై: పౌరసత్వ సవరణ బిల్లుపై తమ స్టాండ్ను స్పష్టం చేస్తూనే శివసేప పార్టీ కేంద్ర ప్రభుత్వానికి కొన్ని ప్రశ్నలు సంధించింది. పౌరసత్వ సవరణ బిల్లును ప్రవేశపెట్టడం ద్వారా బీజేపీ ఓటుబ్యాంకు రాజకీయాలకు తెరలేపుతోందా అని ప్రశ్నించింది. అలా అయితే అది దేశానికి మంచిది కాదని అభిప్రాయపడింది. శివసేన మాతృపత్రిక సామ్నా ద్వారా శివసేన ప్రశ్నించింది. బీజేపీ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారా అంటూ ప్రశ్నించింది. ఇదిలా ఉంటే బిల్లును నేరుగా వ్యతిరేకించనప్పటికీ... వచ్చే 25 ఏళ్ల వరకు కొత్తగా పౌరసత్వం లభించేవారికి ఓటు హక్కు ఇవ్వరాదంటూ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు సూచించింది శివసేన పార్టీ.
అమిత్ షా లోక్సభలో బిల్లును ప్రవేశపెట్టే కొన్ని గంటలకు ముందు శివసేన పార్టీ పౌరసత్వ సవరణ బిల్లుపై ప్రశ్నలు సంధించింది. అంతేకాదు కేవలం హిందువులకు మాత్రమే పౌరసత్వం ఇచ్చే పాటు అయితే దేశంలో మతకల్లోలాలకు దారితీస్తుందని హెచ్చరించింది శివసేన. అంతేకాదు ఈ బిల్లు ద్వారా హిందువులు ముస్లింల మధ్య విబేధాలు పెరిగిపోతాయని కనిపించని విభజన జరుగుతుందని హెచ్చరించింది. అంతేకాదు ఓటు బ్యాంకు రాజకీయాలను ప్రోత్సహించేలా బిల్లు ఉందని శివసేన పార్టీ మండిపడింది.
ప్రస్తుత పరిస్థితుల్లో దేశం అనేక సవాళ్లను సమస్యలను ఎదుర్కొంటుందని ఈ సమయంలో బిల్లును ప్రవేశపెట్టడం సరికాదని చెప్పారు. బిల్లును ప్రవేశపెట్టి కొత్త వివాదానికి తెరతీయరాదని సూచించింది. ఈశాన్య రాష్ట్రాలతో పాటు పశ్చిమ బెంగాల్ రాష్ట్రం కూడా బిల్లును వ్యతిరేకిస్తోందన్న విషయాన్ని గుర్తు చేసింది శివసేన పార్టీ. ఇతర పొరుగుదేశాల్లో హిందువులను అణిచివేస్తున్నారని అట్టి దేశాలపై కూడా ప్రధాని మోడీ రియాక్ట్ కావాలని డిమాండ్ చేసింది. ఒక్క పాకిస్తాన్పై మాత్రమే చర్యలు తీసుకుంటే సరిపోదని ఇతర పొరుగు దేశాలపై కూడా ప్రధాని మోడీ చర్యలు తీసుకోవాలని చెప్పారు.