2019 ఎన్నికల సిత్రం: పూరీ నుంచి ప్రధాని మోడీ పోటీ... కోల్ కతా నుంచి అమిత్ షా పోటీ
కోల్ కతా : భారతీయ జనతా పార్టీ తమ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాను రానున్న లోక్సభ ఎన్నికల్లో కోల్కతాలోని ఉత్తర నియోజకవర్గం నుంచి బరిలోకి దింపనుందా... అంటే ఔననే సమాధానం వినిపిస్తోంది. రాజకీయాల్లో ఏది ఏమైనా జరగొచ్చనే విషయం అందరికీ తెలుసు. ఇక పశ్చిమ బెంగాల్పై కన్నేసిన కమలనాథులు అక్కడ క్యాడర్లో జోష్ నింపేందుకు అమిత్ షాను బరిలో నింపే అవకాశం ఉన్నట్లు సమాచారం. మరో వైపు ప్రధాని మోడీ కూడా ఒడిషాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం పూరీ నుంచి పోటీ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.
కోల్కతా నుంచి అమిత్ షా...పూరీ నుంచి మోడీ
ప్రముఖ న్యూస్ పేపర్ ఆనంద్ బజార్ పత్రిక ప్రకారం కమలం పార్టీ రానున్న లోక్సభ ఎన్నికల్లో పెద్ద తలకాయలనే కోల్కతా బరిలో దింపనున్నట్లు పేర్కొంది. మరోవైపు ప్రధాని మోడీ ఒడిషా నుంచి పోటీ చేసే అవకాశాలున్నట్లు వెల్లడించింది. ఇక దేశవ్యాప్తంగా ప్రధాన రాష్ట్రాల్లో కాషాయం పార్టీ పాగా వేసింది. ఇక రెండు పెద్ద రాష్ట్రాలైన బెంగాల్, ఒడిషాలపై ఇప్పుడు కన్నేసింది. ఈ రెండు రాష్ట్రాల నుంచి 63 మంది ఎంపీలు లోక్సభకు వెళ్లనున్నారు. 2014 ఎన్నికల్లో బెంగాల్లో 42 స్థానాలకు గాను బీజేపీ రెండు స్థానాల్లోనే గెలుపొందగా... ఒడిషాలో 21 స్థానాలకు గాను బీజేపీ ఒక సీటు మాత్రమే గెలుచుకోగలిగింది.
మోడీ పోటీ చేయడం ద్వారా అసెంబ్లీ సీట్లపై కూడా గురిపెట్టిన బీజేపీ
ఇక రెండు రాష్ట్రాల నుంచి కమలం పార్టీకి చెందిన ఇద్దరు ప్రముఖ నేతలు పోటీచేయడం ద్వారా బలహీనంగా ఉన్న పార్టీని బలోపేతం చేయొచ్చనే అంచనా వేస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే ఒడిషాలోని ప్రముఖ పుణ్యక్షేత్ర నగరం పూరి నుంచి ప్రధాని మోడీ పోటీ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. 2014లో కూడా పుణ్యక్షేత్ర నగరం వారణాసి నుంచి మోడీ పోటీ చేసి భారీ మెజార్టీతో గెలిచారు. అదే సమయంలో ఒడిషా కూడా అసెంబ్లీ ఎన్నికలకు వెళుతున్న నేపథ్యంలో మోడీ లోక్సభకు పోటీ చేయడం ద్వారా అసెంబ్లీ సీట్లపై కూడా గురిపెట్టొచ్చనే ఆలోచనతో కమలనాథులు ఉన్నట్లు తెలుస్తోంది.
ఇక బెంగాల్ నుంచి పోటీ చేస్తున్న అమిత్ షా కోసం రెండు స్థానాలు చూసి పెట్టారు స్థానిక కమలనాథులు. ఒకటి కోల్కతా మరొకటి అసన్సోల్ నుంచి పోటీ చేస్తారనే వార్తలు జోరుగా షికారు చేస్తున్నాయి. అయితే 2014 లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి 17శాతం ఓటు షేరు దక్కింది. ఈ క్రమంలోనే అమిత్ షా ఇక్కడి నుంచి పోటీ చేస్తే పార్టీ బలోపేతమవడమే కాక సీట్లు కూడా పెరిగే అవకాశముందని భావిస్తున్నారు. అంతేకాక తృణమూత్ కాంగ్రెస్కు పెద్ద సవాల్గా నిలిచే అవకాశముందని చెబుతున్నారు.
ఉత్తర కోల్కతానే బీజేపీ ఎందుకు ఎంచుకుంది..?
ఇక అమిత్ షాను బెంగాల్ నుంచే ఎందుకు బరిలోకి దింపాలని బీజేపీ భావిస్తోంది అనే ప్రశ్నకు కూడా కమలనాథులు సమాధానం ఇస్తున్నారు. ఉత్తర కోల్కతా ప్రాంతంలో చాలామంది బెంగాలీయేతర ప్రజలే ఉన్నారు. ఇది కాషాయం పార్టీకి కలిసొచ్చే అంశం. మరొక కారణం 2014లో ఈ ప్రాంతంలో బీజేపీ మంచి ప్రదర్శన కనబర్చింది. 2009లో తృణమూల్, కాంగ్రెస్ సంయుక్త అభ్యర్థికి 52.4శాతం ఓటు షేరు రాగా... బీజేపీ 4శాతం ఓట్లతో మూడో స్థానంలో నిలిచింది. కమ్యూనిస్ట్ పార్టీ 40 శాతం ఓటు షేరుతో రెండో స్థానంలో నిలిచింది. 2014 ఎన్నికల్లో టీఎంసీ అభ్యర్థి ఉత్తర కోల్కతా ప్రాంతం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. అయితే ఫలితాల్లో మాత్రం భారీ వ్యత్యాసం కనిపించింది. గెలిచిన అభ్యర్థి ఓటుషేరు 36శాతానికి పడిపోగా.... బీజేపీ 26శాతం ఓట్లతో రెండో స్థానంలో నిలిచింది.
అన్సోల్లో బీజేపీకి పెరిగిన ఓటుశాతం
ఇక అన్సోల్లో ప్రస్తుతం బీజేపీ నేతే ప్రాతినిథ్యం వహిస్తున్నారు. 2009లో టీఎంసీ-కాంగ్రెస్ ఉమ్మడి అభ్యర్థికి 41శాతం ఓట్లు రాగా...విజేతగా నిలిచిన సీపీఎం నేత 49శాతం ఓట్లు వచ్చాయి. బీజేపీకి ఇక్కడ 6శాతానికంటే తక్కువ ఓట్లు వచ్చాయి. అదే 2014 ఎన్నికల సమయానికి బీజేపీ గెలిచి ఒక అద్భుతాన్నే సృష్టించింది. 37 శాతం ఓట్లతో బీజేపీ అభ్యర్థి అన్సోల్లో విజయం సాధించారు. టీఎంసీ అభ్యర్థికి 30 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. ఇక సీపీఎం అభ్యర్థి 22శాతం ఓట్లు మాత్రమే పోలయ్యాయి.