భారత్ను గట్టిగా దెబ్బ కొడుతోన్న కరోనా.. షట్ డౌన్ తప్పదా.. మహారాష్ట్ర సీఎం వార్నింగ్
భారత్లో కరోనా వైరస్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. నియంత్రణ దిశగా ఎన్ని చర్యలు చేపట్టినప్పటికీ.. అధిక జనాభా ఉన్న దేశం కావడంతో వైరస్ తాకిడిని తట్టుకోవడం పెద్ద సవాల్గా మారింది. వైరస్ కేసుల సంఖ్యను బట్టి ఆయా రాష్ట్రాలు ఆంక్షలను అమలుచేస్తున్నాయి. కరోనా తీవ్రతను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు ఏర్పాటైన మంత్రుల బృందం తాజాగా మరోసారి సమీక్ష నిర్వహించింది. ఆంక్షలను మరింత కఠినతరం చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా టర్కీ,యూరప్,బ్రిటన్ల నుంచి వచ్చే ఏ నౌకలను,విమానాలను దేశంలోకి అనుమతించవద్దని నిర్ణయించింది. గల్ఫ్ నుంచి వచ్చేవారిని 14 రోజుల పాటు క్వారెంటైన్లో మెడికల్ అబ్జర్వేషన్లో ఉంచాలని నిర్ణయించింది.
మహారాష్ట్ర సంచలన నిర్ణయం
మంగళవారం(మార్చి 3) కొత్తగా ఒడిశా,లడఖ్,జమ్మూకశ్మీర్లలోనూ కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మిగతా రాష్ట్రాల కంటే మహారాష్ట్రలో పరిస్థితి తీవ్రంగా ఉంది. ఇప్పటివరకు 41 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజాగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ థాక్రేతో ప్రధాని మోదీ ఫోన్లో మాట్లాడి పరిస్థితి గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆంక్షలను మరింత కఠినం చేసే ఆలోచనలో ఉన్నట్టు ఉద్దవ్ థాక్రే మోదీతో చెప్పినట్టు తెలుస్తోంది. ఇళ్లల్లోనే క్వారెంటైన్లో ఉన్న కరోనా అనుమానితుల ఎడమ చేతికి ఒక స్టాంప్ ముద్ర వేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు సమాచారం. కరోనా అనుమానిత లక్షణాలతో ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న ఏడుగురు పారిపోవడంతో.. ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
ముంబైలో ఆలయాల మూసివేత.. మహారాష్ట్ర సీఎం వార్నింగ్
కరోనా వైరస్ కారణంగా ఇప్పటికే ముంబైలో మాల్స్,థియేటర్స్,యూనివర్సిటీలను మూసివేశారు. పబ్లిక్ ఫంక్షన్స్,ఈవెంట్స్,అనవసర ప్రయాణాలు రద్దు చేసుకోవాలని ప్రభుత్వం ప్రజలకు విజ్ఞప్తి చేసింది. అయితే కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతుండటంతో ప్రభుత్వం రవాణా వ్యవస్థపై కూడా కఠిన నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఈ మేరకు ముఖ్యమంత్రి ఉద్దవ్ థాక్రే కీలక ప్రకటన చేశారు. ప్రజలు అనవసర ప్రయాణాలను తగ్గించుకోకపోతే.. రైళ్లు,బస్సులను కూడా నిలిపివేయాల్సి వస్తుందన్నారు. ఇప్పటికే ముంబైలోని ప్రముఖ దేవాలయాలైన సిద్ది వినాయక ఆలయం,తుల్జా భవానీ ఆలయాలను మూసివేశఆరు. ఇక రైళ్లు,బస్సులను కూడా నిలిపివేస్తే రాష్ట్రం పూర్తిగా స్తంభించిపోవడం ఖాయం. ప్రస్తుతం దేశంలో మహారాష్ట్ర కరోనా వైరస్ వ్యాప్తికి కేంద్రంగా మారింది. ఈ నేపథ్యంలోనే కఠిన చర్యల దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది.
అందుబాటులోకి టోల్ ఫ్రీ నెంబర్స్
అటు కర్ణాటకలో మాల్స్,థియేటర్స్,పార్కులు,పబ్లు,జిమ్స్,మైదానాలు అన్నీ మూతపడ్డాయి. ఐటీ ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. దేశంలో తొలి కరోనా మరణం కర్ణాటకలోనే సంభవించగా.. తాజాగా మృతుడి కుమార్తెకు కూడా కరోనా లక్షణాలు బయటపడ్డాయి. ప్రస్తుతం రాష్ట్రంలో దాదాపు 60శాతం రవాణా స్తంభించిపోయింది. ఇక బీహార్,ఛత్తీస్ఘడ్ అసెంబ్లీలు సమావేశాలను కుదించాయి. అటు పార్లమెంటుకు హాజరయ్యే ఎంపీలకు,సిబ్బందికి,జర్నలిస్టులకు థర్మల్ స్క్రీనింగ్ చేస్తున్నారు. కరోనా తీవ్రత దృష్టిలో ఉంచుకుని తాజ్ మహల్ సందర్శనకు మార్చి 31 వరకు బ్రేక్ వేశారు. తాజ్ మహల్ సహా పురావస్తు శాఖ పరిధిలోని 3600 సందర్శన ప్రదేశాలను తాత్కాలికంగా మూసివేశారు. కరోనా కేసులకు సంబంధించి టోల్ ఫ్రీ నెం.1075ని అందుబాటులోకి తెచ్చారు. అలాగే విదేశాల్లో ఉన్న భారతీయుల కోసం మరో టోల్ ఫ్రీ నెంబర్ను అందుబాటులోకి తెచ్చారు.
35 రైళ్లు రద్దు..
కరోనా ఎఫెక్ట్ దాదాపుగా అన్ని రంగాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. వైరస్ వ్యాప్తి కారణంగా రైళ్లలో ఆక్యుపెన్సీ రేటు తగ్గడంతో పశ్చిమ రైల్వే పరిధిలో నడిచే 35 రైళ్ల సర్వీసులను రైల్వే రద్దు చేసింది. ఢిల్లీ సమీపంలోని గురుగ్రామ్ జిల్లాలో అన్ని ఎంఎన్సీ,ఐటీ,పరిశ్రమలు,బీపీవో,కార్పోరేట్ కంపెనీలు మార్చి 31 వరకు తమ ఉద్యోగులను వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాల్సిందిగా సూచించాలని హర్యానా పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ డిప్యూటీ డైరెక్టర్ రణబీర్ సింగ్ సంగ్వాన్ కీలక ఆదేశాలు జారీ చేశారు. అదీ,ఇదీ అనీ కాకుండా దాదాపుగా అన్ని రంగాలపై కరోనా ప్రతికూల ప్రభావం కనిపిస్తోంది. ఇప్పటికే పౌల్ట్రీ ఎంతగా పతనమైందో చూస్తూనే ఉన్నాం. అటు ట్రేడ్ మార్కెటింగ్ కూడా నిలిచిపోయే పరిస్థితి. ఇవన్నీ చూస్తుంటే త్వరలోనే భారత్ పూర్తి స్థాయిలో షట్ డౌన్ కాబోతుందా అన్న సందేహాలు తలెత్తుతున్నాయి.