కరోనాకు కొత్త కేంద్రబిందువుగా భారత్ మారుతోందా.. పెరుగుతున్న కేసులు ఏం చెబుతున్నాయి.?
కరోనావైరస్కు కేంద్ర బిందువుగా భారత్ తయారవుతోందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ప్రపంచ దేశాల్లో రెండో అతిపెద్ద జనాభా ఉన్న దేశంగా గుర్తింపు పొందిన భారత్లో కరోనావైరస్ నానాటికీ విజృంభిస్తోంది. ఒక్కరోజులోనే 78వేలకు పైగా కరోనావైరస్ పాజిటివ్ కేసులు నమోదు అవుతుండటం చూస్తే ఆందోళన కలిగిస్తోంది. ఒకే రోజు 971 మరణాలు కూడా బెంబేలెత్తిస్తున్నాయి. ఒక్క రోజు నమోదైన మరణాల సంఖ్యలో మెక్సికోను భారత్ దాటేసింది. ప్రస్తుత పరిస్థితి చూస్తే పాజిటివ్ కేసుల్లో బ్రెజిల్ను మరో వారంలో దాటేలా కనిపిస్తుండగా అమెరికాను మరో రెండు నెలల సమయంలో దాటేస్తుందని నిపుణులు చెబుతున్నారు.
ఏడు నెలలుగా పెరుగుతున్న కరోనా కేసులు
ఈ ఏడాది జనవరి 30న తొలి కరోనావైరస్ కేసు భారత్లో గుర్తించబడగా... ఏడు నెలలు గడిచినప్పటికీ పెరుగుతున్నాయే తప్ప తరగడం లేదు. ప్రస్తుత పరిస్థితులు చూస్తే భారత్ ఎక్కడికెళుతుందోనన్న ఆందోళన వ్యక్తమవుతోందని ప్రభుత్వం నియమించిన కోవిడ్ -19 టాస్క్ఫోర్స్ సభ్యులు నమన్ షా చెప్పారు. ఇక ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థలు కుదేలవుతున్న నేపథ్యంలో బలవంతంగా లాక్డౌన్ ఎత్తేసి ముందుకెళుతున్నాయి. ఇక అత్యంత ధనిక దేశాలు కూడా క్రమంగా పేద దేశాల జాబితాలో చేరుతున్నాయి. అంతలా ఈ మహమ్మారి ఆ దేశాల యొక్క ఆర్థిక వ్యవస్థలను ఛిన్నా భిన్నం చేసింది.
కేసులు అధికారిక సంఖ్య కంటే ఎక్కువగా...
ఇక భారత్ విషయానికొస్తే ఇప్పటికే వైరస్తో కలిసి జీవించడం నేర్చుకోవాలని ఇందుకు తగిన జాగ్రత్తలు పాటించాలని స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. లాక్డౌన్ ఎత్తివేస్తూనే స్థానిక ప్రభుత్వాలకే లాక్డౌన్ ఆప్షన్ ఇవ్వడం జరిగింది. దేశ ఆర్థిక వ్యవస్థ గతేడాది జూన్ త్రైమాసికంతో పోలిస్తే 18శాతం కుచించుకుపోయింది. ఇతర ఆసియా దేశాలతో పోలిస్తే భారత ఆర్థిక వ్యవస్థే ఇంతలా నష్టపోయిందనేది లెక్కలు చెబుతున్నాయి. ఇక కరోనావైరస్ పాజిటివ్ కేసులు అధికారిక గణాంకాల కంటే ఎక్కువగానే ఉన్నాయని కొన్ని సంస్థలు చెబుతున్నాయి. ప్రస్తుతం 3.6 మిలియన్ పాజిటివ్ కేసులున్నాయని అధికారిక గణాంకాలు చెబుతుండగా వాస్తవానికి ఈ సంఖ్య చాలా ఎక్కువగానే ఉన్నాయని కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి.
నగరాల నుంచి గ్రామీణ ప్రాంతాలకు...
భారత్లో కరోనావైరస్ ఇప్పటి వరకు పెద్ద నగరాలపైనే విరుచుకుపడింది. ఇక క్రమంగా గ్రామీణ ప్రాంతాలను సైతం బెంబేలెత్తిస్తోంది. 900 మిలియన్ మంది నివసించే గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడైతే సరియైన హాస్పిటల్స్ లేవో, మౌలిక సదుపాయాలు లేవో అక్కడ కనుక విజృంభిస్తే పరిస్థితి చేదాటి పోతుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సరైన పరీక్షలు నిర్వహించకపోతే పాజిటివ్ కేసులు పెరిగి అక్కడి నుంచి మరణాల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. మరణాల రేటు మోడీ ప్రభుత్వం 1.8శాతం మాత్రమే చెప్పడం ద్వారా మేనేజ్ చేస్తోందని పలువురు ఆరోపణలు చేస్తున్నారు.
మృతుల్లో అధికంగా యువతే
వాస్తవానికి భారత్లో మరణాల సంఖ్య పెరుగుతూనే ఉంది. ముఖ్యంగా ఈ మహమ్మారి బారిన పడి 35 ఏళ్లలోపు మరణించినవారు 65శాతంగా ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా సగటు మరణాల రేటుతో భారత మరణాల రేటు ఉందని మసాచుసెట్స్లోని నేషనల్ బ్యూరో ఆఫ్ ఎకనామిక్ రీసెర్చ్ చెబుతోంది. కరోనావైరస్ ఇన్ఫెక్షన్కు సంబంధించి టెస్టులు అధికంగా చేయడంలో జాప్యం చేశామని, అదే సమయంలో వ్యాధి వ్యాప్తిని నియంత్రించడంలో కూడా జాప్యం చేశామని సెంటర్ ఫర్ డిజీస్ డైనమిక్స్ ఎకనామిక్స్ అండ్ పాలసీ డైరెక్టర్ రామనన్ లక్ష్మీనారాయన్ చెబుతున్నారు. ఇక భారత్లాంటి దేశంలో పెద్ద ఎత్తున పరీక్షలు చేయడం అసాధ్యమని చెప్పిన ఆయన... భారత ఆరోగ్యశాఖ వ్యవస్థను కూడా దృష్టిలో ఉంచుకోవాలని అన్నారు.