ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు అసేంబ్లీకి నిమ్మకాయలు తెచ్చారు తప్పా? ప్రతిపక్షాలను ప్రశ్నించిన సీ
బెంగళూరు: కర్ణాటకలో కుమారస్వామి ప్రభుత్వం బలపరీక్షను ఎదుర్కొంటున్న వేళ.. శాసనసభలో నిమ్మకాయల కలకలం చెలరేగింది. కుమారస్వామి సోదరుడు, కర్ణాటక మంత్రి హెచ్డీ రేవణ్ణ తన వెంట ఓ నిమ్మకాయను సభకు తెచ్చుకోవడం ప్రతిపక్ష భారతీయ జనతాపార్టీ సభ్యులను భయంకపితులను చేసింది. రేవణ్ణ చేతుల్లో ఉన్న నిమ్మకాయను చూసి ప్రతిపక్ష నేత బీఎస్ యడ్యూరప్ప సహా ఇతర సభ్యులందరూ ఉలిక్కిపడ్డారు. వెంటనే- తమ స్థానాల్లోంచి లేచి, స్పీకర్ రమేష్కుమార్కు ఫిర్యాదు చేశారు. రేవణ్ణ చేతుల్లో నిమ్మకాయ ఉండటాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. దీనితో కొద్ది నిమిషాల పాటు చర్చ పక్కదారి పట్టింది.
చాముండి అమ్మవారిని దర్శించిన రేవణ్ణ
కుమారస్వామి కుటుంబానికి భక్తి కాస్త ఎక్కువే. ఎలాంటి కష్టమొచ్చినా, గుళ్లూ, గోపురాలు తిరగేస్తారు. బలపరీక్ష ఎదుర్కొనడానికి ఒక్కరోజు ముందు కూడా కుమారస్వామి నివాసంలో పెద్ద ఎత్తున హోమం నిర్వహించారు. తాజాగా- శాసనసభ సమావేశాల తొలిరోజైన గురువారం నాడు సభ ముగిసిన తరువాత కుమారస్వామి సోదరుడు, మంత్రి రేవణ్ణ మైసూరుకు వెళ్లారు. చాముండి కొండలపై వెలిసిన శ్రీ చాముండేశ్వరి దేవిని దర్శించుకున్నారు. బహుశా- ఆ సమయంలో ఆలయ అర్చకులు ఇచ్చిన నిమ్మకాయను ఆయన చేతిలో పట్టుకుని ఈ ఉదయం శాసనసభా సమావేశాలకు హాజరయ్యారు.
వీడియో: యడ్డీ ముఖ్యమంత్రి కావాలంటూ..వెయ్యిన్నొక్క మెట్లెక్కిన మహిళా ఎంపీ!
చేతబడి చేసి, ప్రభుత్వాన్ని కాపాడుకునే ఛాన్స్ ఉందా?
రేవణ్ణ చేతిలో నిమ్మకాయ ఉండటం, దానికి కుంకుమ మరకలు ఉండటం ప్రతిపక్ష బీజేపీ సభ్యులను ఆందోళనకు గురి చేసింది. చేతబడి చేసి మరీ ఆ నిమ్మకాయలను తీసుకొచ్చారని, వాటిని తమపై ప్రయోగిస్తారా? అంటూ బీజేపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ నిమ్మకాయను వెంటనే బయట పడేయాలని సూచించారు. ఈ విషయాన్ని స్పీకర్ దృష్టికీ తీసుకెళ్లారు. ఓ నిమ్మకాయను చూసి బీజేపీ సభ్యులు ఆందోళన వ్యక్తం చేయడాన్ని చూసిన కుమారస్వామి నవ్వుకున్నారు. చిరునవ్వుతోనే ఆయన ప్రతిపక్ష సభ్యులకు చురకలు అంటించారు. చేతబడి చేసి ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి అవకాశం ఏమైనా ఉందా? అని ప్రశ్నించారు.
పేటెంట్ ఉన్న మీరే ఇలా భయపడితే ఎలా?
తనకు, తన సోదరుడికి, తన కుటుంబానికి దేవుళ్ల పట్ల అపారమైన భక్తి, శ్రద్ధలు ఉన్నాయని కుమారస్వామి అన్నారు. భారతీయ సంప్రదాయాలు, పూజా పునస్కారాల్లో నిమ్మకాయకు ఉన్న ప్రాధాన్యత ప్రతి హిందువుకూ తెలుసని చెప్పారు. సంప్రదాయాలపై తమకు మాత్రమే పేటెంట్ ఉందన్నట్లు గొంతు చించుకునే బీజేపీ సభ్యులు- గుడిలో పూజకు ఉంచి తీసుకొచ్చిన నిమ్మకాయను చూసి భయపడటం ఆశ్చర్యకరంగా ఉందని ఎద్దేవా చేశారు. రేవణ్ణ గుడికి వెళ్లి- తన వెంట ఆ నిమ్మకాయను తెచ్చుకున్నారే తప్ప- చేతబడి చేసి కాదని అన్నారు. ఈ సందర్భంగా కొద్దిసేపు చర్చ పక్కదారి పట్టినట్టయింది.