ఎగ్జిట్ పోల్స్ నిజమైతే కర్ణాటక ప్రభుత్వం కథ ఏమిటి ? అప్పుడే గుబులు, అసమ్మతి ఎమ్మెల్యేలు !
బెంగళూరు: ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు విడుదల కావడంతో కర్ణాటకలోని కాంగ్రెస్-జేడీఎస్ పార్టీల సంకీర్ణ ప్రభుత్వం పరిస్థితి ఏమిటి ? అనే విషయంలో జోరుగా చర్చ మొదలైయ్యింది. ఇప్పటికే బీజేపీ నాయకులు కాంగ్రెస్-జేడీఎస్ పార్టీల సంకీర్ణ ప్రభుత్వానికి డెడ్ లైన్ విదించడంప్రాధాన్యత సంచరించుకుంది.
కర్ణాటకలో మొత్తం 28 లోక్ సభ నియోజక వర్గాలు ఉన్నాయి. గువారం సాయంత్ర విడుదలైన ఎగ్జిట్ పోల్స్ సర్వేల ప్రకారం కర్ణాటకలో 19 లోక్ సభ నియోజక వర్గాల్లో బీజేపీ విజయం సాదించనుంది. అనుకున్న స్థాయిలో బీజేపీ విజయం సాదించినట్లు అయితే కర్ణాటకలో బీజేపీ అధికారంలోకి రావడం అంత కష్టం అయిన పనికాదు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
కాంగ్రెస్ అసమ్మతి ఎమ్మెల్యేలు !
కేంద్రంలో మరోసారి బీజేపీ అధికారంలోకి వస్తే కర్ణాటకలో ఆసమ్మతితో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు గాలం వెయ్యడానికి బీజేపీ నాయకులు ప్రయత్నిస్తారని సమాచారం. కేంద్రంలో, రాష్ట్రంలో ఒకే పార్టీ అధికారంలో ఉంటే అభివృద్ది విషయంలో ఎలాంటి సమస్యలు ఉండవని కాంగ్రెస్ అసమ్మతి ఎమ్మెల్యేలు బావిస్తున్నారని, అందుకే బీజేపీకి బేషరతుగా మద్దతు ఇవ్వడానికి సిద్దం అవుతున్నారని తెలిసింది.
మండ్య ఫలితాలు
కాంగ్రెస్-జేడీఎస్ పార్టీల సంకీర్ణ ప్రభుత్వానికి సర్వే ఫలితాల దెబ్బ పడనుంది. ముఖ్యంగా మండ్య లోక్ సభ ఫలితాల ప్రభావం కర్ణాటక ప్రభుత్వం మీద చూపిస్తుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి కుమారుడు నిఖిల్ కుమారస్వామి మండ్య లోక్ సభ నియోజక వర్గంలో పోటీ చేశారు. స్వతంత్ర పార్టీ అభ్యర్థిగా సుమలత పోటీ చేశారు. సర్వేల ప్రకారం ఇద్దరూ గెలిచే అవకాశం 50-50 శాతంగా ఉందని సర్వేలు చెబుతున్నాయి..
సీఎంకు దెబ్బ
మండ్య లోక్ సభ నియోజక వర్గంలో సీఎం కుమారస్వామి చాల రోజులు ప్రచారం చేశారు. మండ్యలో సుమలత గెలిస్తే సీఎం కుమారస్వామి ప్రతిష్టకు దెబ్బపడే అవకాశం ఉంది. సంకీర్ణ ప్రభుత్వంలో సీఎం కుమారస్వామి పరిస్థితి ఏమిటి ? అనే చర్చ మొదలైయ్యింది. నిఖిల్ కుమారస్వామి ఓడిపోతే ఆ ప్రభావం సంకీర్ణ ప్రభుత్వం మీద పడే అవకాశం ఉందని తెలిసింది. మొత్తం మీద మండ్యలో సుమలత గట్టిపోటీ ఇచ్చారని సర్వేలలో వెలుగు చూసింది.
సీఎంగా సిద్దరామయ్య ?
సిద్దరామయ్య సీఎం కావాలనే నినాదం జోరందుకుంది. ఇది సంకీర్ణ ప్రభుత్వం మీద దెబ్బ పడటానికి అవకాశం ఉంది. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు నిజం అయితే ఈ నినాదం ఇంకా జోరందుకోవడానికి అవకాశం ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలోని అసమ్మతి ఎమ్మెల్యేలు సీఎం కుమారస్వామి మీద గుర్రుగా ఉన్నారు.
అసెంబ్లీ రద్దు ?
ఇటీవల జేడీఎస్ నాయకుడు బసవరాజ్ హోరట్టి మాట్లాడుతూ కర్ణాటక అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెళితే మంచి ఫలితం ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. లోక్ సభ ఎన్నికల ఫలితాల తరువాత అదే జరిగితే మనకే మంచిది అంటున్నారు బీజేపీ నాయకులు. మొత్తం మీద ఎన్నికల ఫలితాల దెబ్బతో కర్ణాటకలోని సంకీర్ణ ప్రభుత్వం అయోమయంలో పడింది.