కర్ణాటకలో కేసీఆర్ వ్యూహం ఫలించిందా? జాతీయపార్టీలు మోకరిల్లాల్సిందేనా?
జాతీయస్థాయి రాజకీయాల్లో కీలక పాత్ర పోషించడానికి సిద్ధమవుతున్న తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావుకు కర్ణాటక ఎన్నికల ఫలితాలు మంచి జోష్ను పెంచాయి. కాంగ్రెస్, బీజేపీ వ్యతిరేక శక్తులను కూడగట్టడానికి కేసీఆర్ ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇటీవల పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో పర్యటించి ఫెడరల్ ఫ్రంట్ కాన్సెప్టును తెరపైకి తెచ్చారు. తాజాగా కర్ణాటక ఎన్నికల ముందు జనతాదళ్-సెక్యులర్ (జేడీఎస్) పార్టీకి తెలంగాణ రాష్ట్ర సమితి మద్దతు తెలిపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వ ఏర్పాటులో జేడీఎస్ కీలకంగా మారడం కేసీఆర్ విజన్కు కొంత ఊతం ఇచ్చినట్టు కనిపిస్తున్నది.
కేసీఆర్ మద్దతుతో జోష్
కర్ణాటకలో తెలుగువారు జేడీఎస్కు అండగా నిలవాలి. అవసరమైతే ఎన్నికల ప్రచారం చేస్తా అని కేసీఆర్ వ్యాఖ్యలు జేడీఎస్ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపాయి. జేడీఎస్కు నైతిక బలాన్ని ఇవ్వడానికి సీఎం కేసీఆర్ పర్యటన ఉపయోగపడింది అని టీఆర్ఎస్ వర్గాలు పేర్కొంటున్నాయి. తాము ముందుగా అంచనావేసిన స్థానాలకంటే అదనంగా వచ్చాయనే ఆనందంలో నేతలు ఉన్నారు.
ఆ పార్టీలకు ఓటు వేయొద్దు
కర్ణాటక ఎన్నికల నేపథ్యంలో ఆది నుంచి బీజేపీ, కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయవద్దనే అభిప్రాయాన్ని కేసీఆర్ వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్ జాతీయ రాజకీయాల్లో ప్రాంతీయ పార్టీలదే హవా అనే ఆయన బలంగా నమ్ముతున్నారు. కర్ణాటక రాజకీయాల్లో జేడీఎస్ కింగ్ మేకర్ కానున్నదని కేసీఆర్ జోస్యం చెప్పారు. తన విజన్ ప్రకారమే ప్రస్తుతం కన్నడ పాలిటిక్స్లో కుమారస్వామి కీలకంగా మారాడు.
భవిష్యత్లో ప్రాంతీయపార్టీలదే హవా
రాబోయే సాధారణ ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలన్నీ ఐక్యరాగం వినిపిస్తే ఫెడరల్ ఫ్రంట్దే విజయం. కర్ణాటకలో మాదిరిగానే భవిష్యత్లో జాతీయపార్టీలు దిగిరాక తప్పదు అంటూ కేసీఆర్ పలు సందర్భాల్లో ధీమా వ్యక్తం చేశారు. కర్ణాటక ఫలితాలు కేసీఆర్ విజన్కు అద్దం పట్టినట్టు స్పష్టమవుతున్నది.
కేసీఆర్ అంచనాలు నిజమయ్యేను..
కన్నడ ఎన్నికల ఫలితాలు అస్పష్టంగా ఉండటం, ఏ పార్టీకి మెజారిటీ రాకపోవడంతో హంగ్గా మారడం లాంటి కేసీఆర్ అంచనాలను నిజం చేశాయనే మాట వినిపిస్తున్నది. ఫలితాల అనంతరం ప్రాంతీయపార్టీ జేడీఎస్వైపే జాతీయ పార్టీలు దృష్టిపెట్టాయి. తమకు అనుకూలంగా మార్చుకోనేందుకు పావులు కదిపాయి. బేషరతుగా కాంగ్రెస్ మద్దతు తెలపడంతో జేడీఎస్ సానుకూలంగా స్పందించింది.