కర్ణాటక సీఎంగా కుమారస్వామి కొనసాగుతారా...? బీజేపీ వేసిన స్కెచ్ ఏంటి..?
అనేక నాటకీయ పరిణామాల మధ్య కర్ణాటకలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన జేడీయూ కాంగ్రెస్లు ... ఇక ఎంతో కాలం బీజేపీ ముందు నిలవలేవనే వార్త ప్రచారంలో ఉంది. కుమారస్వామి సీఎంగా బాధ్యతలు చేపట్టాక కొందరు కాంగ్రెస్ నుంచి అసంతృప్తులు బయటకొచ్చారు. వీరినే ఆయుధంగా మలచుకుని కుమారస్వామి ప్రభుత్వాన్ని పడగొట్టాలన్న ఆలోచనలో బీజేపీ ఉన్నట్లు సమాచారం. అదికూడా బడ్జెట్ ప్రవేశపెట్టే లోపే జరగాలనే కృతనిశ్చయంతో బీజేపీ ఉన్నట్లు తెలుస్తోంది.
కుమారస్వామే స్వయంగా బడ్జెట్ ప్రవేశపెట్టడంపై అసంతృప్తి వ్యక్తం చేసిన కర్ణాటక మాజీ సీఎం సిద్ధరామయ్య వీడియో వైరల్ అవడంతో... కాంగ్రెస్ జేడీఎస్ల మధ్య అప్పుడే లుకలుకలు మొదలయ్యాయనే సంకేతాలు వెలువడ్డాయి. అయితే సిద్ధరామయ్య అసంతృప్తి వ్యక్తం చేయడంపై సీఎం కుమారస్వామి పెద్దగా పట్టించుకోలేదు. నేతలు ఏమనుకుంటున్నారో తనకు అనవసరమని... ప్రజల సంక్షేమమే తనకు ముఖ్యమని మీడియా సమావేశంలో తేల్చి పారేశారు.
ఇదిలా ఉంటే బీజేపీ జాతీయాధ్యక్షుడిని కలిసేందుకు మాజీ సీఎం యడ్యూరప్ప అహ్మదాబాద్కు వెళ్లారు. అయితే 2019 సాధారణ ఎన్నికలపై చర్చించేందుకే యడ్యూరప్ప అహ్మదాబాద్కు వెళ్లారని బీజేపీ చెబుతున్నప్పటికీ... విశ్వసనీయ సమాచారం ప్రకారం యెడ్డీ అసంతృప్తి కాంగ్రెస్ ఎమ్మెల్యేల జాబితాపై చర్చించేందుకే వెళ్లినట్లు తెలుస్తోంది. జూలై 2న అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో అంతకంటే ముందే ఈ అసంతృప్తులను తమవైపు మళ్లించుకుని అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టే యోచనలో యడ్యూరప్ప ఉన్నట్లు తెలుస్తోంది.
అయితే ఇప్పుడే తొందరపడొద్దని అమిత్ షా చెప్పినట్లు తెలుస్తోంది. బీజేపీ అసంతృప్తి కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో ఎలాంటి చర్చలు జరపలేదని... వారు బీజేపీ తీర్థం పుచ్చుకుంటామంటే వారిని పార్టీలోకి స్వాగతిస్తామని యడ్యూరప్ప సన్నిహిత వర్గాలు తెలిపాయి.