భారత ప్రధానివా? పాక్ ప్రతినిధివా? మోదీపై మమత ఫైర్
పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)పై వ్యతిరేక నిరసనలు మిగతా రాష్ట్రాల్లో చల్లబడినా.. వెస్ట్ బెంగాల్ లో మాత్రం ఉధృతంగా సాగుతున్నాయి. ముఖ్యమంత్రి మమత బెనర్జీ స్వయంగా ఆందోళనలకు నేతృత్వం వహిస్తున్నారు. శుక్రవారం కూడా సిలిగురిలో నిర్వహించిన సీఏఏ వ్యతిరేక నిరసనలో ఆమె పాల్గొన్నారు. నిరసనకారుల్ని ఉద్దేశించి మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
పాక్ పాట ఎన్నాళ్లు?
‘‘భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకలా నిలిచే ఇండియాకు తనదైన గొప్ప సంస్కృతి, వారసత్వం ఉన్నాయి. కానీ ఇవేవీ పట్టనట్టు మన ప్రధాని మోదీ పదే పదే పాకిస్తాన్ పాట పాడుతారు. ప్రతిసారి ఇండియాను పాకిస్తాన్ తో పోల్చుతారు. నా అనుమానం అసలాయన భారత ప్రధానా? పాకిస్తాన్ ప్రతినిధా? అన్ని సార్లు పాక్ పేరు తల్చుకోవాల్సిన అవసరమేంటి?''అని మమత ప్రశ్నించారు.
అడగటమే సిగ్గుచేటు..
స్వాతంత్ర్యం వచ్చిన 70 ఏండ్ల తర్వాత దేశ పౌరులు జాతీయతను నిరూపించుకోవాల్సి రావడం బాధాకరమని, అలా నిరూపించుకోమని మోదీ ప్రభుత్వం అడగటం సిగ్గుచేటని మమత విమర్శించారు. తాను బతికున్నంత కాలం వెస్ట్ బెంగాల్ లో సీఏఏగానీ, ఎన్ఆర్సీ చట్టాన్నిగానీ అమలు కానివ్వబోనని ఆమె మరోసారి స్పష్టంచేశారు.
తికమక పెట్టేందుకే ఇలా..
దేశవ్యాప్త ఎన్ఆర్సీ విషయంలో కేంద్ర సర్కార్ ప్రజలకు అబద్ధాలు చెబుతోందని, దానిపై అసలు చర్చే జరగలేదని ప్రధాని మోదీ చెబితే.. హోం మంత్రి అమిత్ షా మాత్రం ప్రక్రియ కొనసాగుతుందని అంటారని, జనాన్ని తికమక పెట్టేందుకు బీజేపీ నేతలు ప్రయత్నిస్తున్నారని, మోదీ, షా పన్నాగాలు బెంగాల్ లో సాగబోవని మమత బెనర్జీ అన్నారు.