నమాజ్ మసీదులోనే చేయాలా...1994 సుప్రీం తీర్పును పునఃపరిశీలించనున్న జస్టిస్ దీపక్ మిశ్రా బెంచ్
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా ఆ పదవిలో మరో వారం రోజుల పాటు మాత్రమే ఉంటారు. ఈ సమయంలో ఆయన పలు కీలక కేసులపై తీర్పు ఇవ్వనున్నారు. ఇందులో ముఖ్యంగా అయోధ్యలో రామమందిర నిర్మాణంపై తీర్పు చెప్పనున్నారు. అయితే ఇక్కడ రామమందిర నిర్మాణ అంశం ముఖ్యం కాదు... 1994లో డాక్టర్ ఇస్మాయిల్ ఫరూకీ ఇచ్చిన తీర్పులో చట్టానికి సంబంధించిన అంశంపై తీర్పు ఇవ్వనున్నారు జస్టిస్ దీపక్ మిశ్రా. మసీదు అనేది ఇస్లాం మతంలో భాగామా కాదా అనే అంశంపై తీర్పు ఇవ్వనున్నారు.
2010 రామజన్మభూమి వివాదంలో అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును కొందరు ఆశ్రయించారు. ఈ కేసును విచారణ చేస్తున్న చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ అబ్దుల్ నజీర్ల ధర్మాసనం మరో కొత్త పాయింట్ను వెలికితీసింది. అసలు మసీదు ఇస్లాం మతంలో భాగమేనా అనే కొత్త పాయింట్ తెరపైకొచ్చింది.
అయోధ్య చట్టం 1993 రాజ్యాంగ బద్ధమేనా అన్న అంశంపై విచారణ జరిపింది జస్టిస్ ఎంవీ వర్మ, రే, బరూచాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం. దీనిపై తీర్పును కూడా వెలువరించింది. ఈ సందర్భంగా మసీదు ఇస్లాంలో భాగమేనా అన్న ప్రశ్న ఉత్పన్నమైంది. ముస్లిం మతానికి చెందిన వ్యక్తి కేవలం మసీదులోనే ప్రార్థనలు చేయాలని ముస్లిం మతం ఎక్కడా బోధించలేదని... ఎక్కడైనా ప్రార్థనలు చేసుకోవచ్చని పేర్కొందని న్యాయమూర్తులు గుర్తు చేశారు. ఇతర మతాలు కూడా ఇదే అనుసరిస్తున్నాయని వారు పేర్కొన్నారు.
ఇక ఇదే అంశంపై ఛీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేయనుంది. 1994లో వచ్చిన తీర్పునే బెంచ్ సమర్థించే అవకాశం ఉంది..లేదా అందులోని అంశాలను అర్థం చేసుకోవాలని సూచించే అవకశం ఉందని అదీ కాకపోతే మొత్తంగా ఆ తీర్పునే కొట్టేసే అవకాశముందని న్యాయనిపుణులు చెబుతున్నారు. రామజన్మభూమి విషయంలో చట్టపరమైన అంశాలకు సమాధానం ఇచ్చిన తర్వాత కేసును రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ చేసే అవకాశముంది. ఇక్కడే అయోధ్యలో రామమందిరం నిర్మాణం చేపట్టొచ్చా లేదా అనేదానిపై తుది తీర్పు వెలువడుతుంది.