శివసేనకు ఎన్సీపీ జై కొట్టేనా.. సీఎం కుర్చీ బీజేపీ చేజారేనా?
ముంబై : మహారాష్ట్ర రాజకీయ చదరంగం మరింత రసవత్తరంగా మారింది. ప్రభుత్వ ఏర్పాటులో సగం.. సీఎం కుర్చీలో మరో సగం పొత్తంటూ శివసేన పెట్టిన లాజిక్కు వర్కవుట్ కాలేదు. 50-50 ఫార్ములాకు నో అంటూ బీజేపీ తేల్చి చెప్పిన నేపథ్యంలో శివసేన మరో రకంగా పావులు కదుపుతోంది. ఎన్సీపీతో జతకట్టి ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని ఇదివరకే ప్రకటించినా.. అటు నుంచి స్పందన లేదు. అయితే తాజాగా ఎన్సీపీ ముఖ్య అధికార ప్రతినిధి నవాబ్ మాలిక్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ప్రభుత్వ ఏర్పాటులో శివసేనకు అండగా ఉంటామని సూచన ప్రాయంగా వెల్లడించడం హాట్ టాపికైంది.
గమ్మత్తుగా మహా రాజకీయం.. ట్విస్టుల మీద ట్విస్టులు
మహారాష్ట్ర రాజకీయం గమ్మత్తుగా మారింది. ప్రభుత్వ ఏర్పాటులో ట్విస్టుల మీద ట్విస్టులు నడుస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 105 స్థానాల్లో విజయం సాధించింది. అటు శివసేన 56 స్థానాల్లో గెలుపొందింది. ఎన్సీపీకి 54.. కాంగ్రెస్ పార్టీకి 44 సీట్లు వచ్చాయి. అయితే 288 అసెంబ్లీ స్థానాలున్న మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు 145 ఎమ్మెల్యేల సంఖ్యాబలం అవసరమవుతుంది. ఆ క్రమంలో ఎన్నికలకు ముందు శివసేనతో పొత్తు పెట్టుకున్న బీజేపీ.. ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమైంది. అయితే సీఎం కుర్చీ చెరో సగమంటూ శివసేన పేచీ పెడుతుండటంతో ప్రతిష్ఠంభన నెలకొంది. అది కుదరదంటూ ఇప్పటికే బీజేపీ నేతలు కరాఖండిగా చెప్పేశారు. దాంతో శివసేన పెద్దలు ప్రత్యామ్నాయ మార్గాల వైపు చూస్తున్నారు.
హరీశ్ రావుకు చేదు అనుభవం.. మంత్రిని తాకిన ఆర్టీసీ సెగ..!
బీజేపీ, శివసేన.. ఎవరి దారి వారిదే
మహారాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటులో ఇటు బీజేపీ, అటు శివసేన ఎవరికివారుగా సన్నాహాలు చేస్తుండటంతో మహారాష్ట్రలో రాజకీయ సమీకరణాలు మారనున్నాయా అనే సందిగ్ధం నెలకొంది. శివసేనకు జై కొడుతున్నట్లుగా ఎన్సీపీ సంకేతాలు పంపిన నేపథ్యంలో మహా ప్రభుత్వ ఏర్పాటు ఇంకా ఆసక్తికరంగా మారింది. ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకొస్తే శివసేనకు మద్దతిస్తామని సూచన ప్రాయంగా వెల్లడించడంతో ఏ క్షణానికి ఏం జరుగుతుందోననే ఉత్కంఠ పరిస్థితులు కనిపిస్తున్నాయి.
శివసేన అందుకు సిద్ధమైతే తాము రెడీ అంటూ..!
బీజేపీ ప్రస్తావన లేకుండా ఛత్రపతి శివాజీ సూచించినట్లుగా ప్రజా ప్రభుత్వ ఏర్పాటుకు శివసేన సన్నద్ధమైతే తాము సానుకూలం అన్నట్లుగా ఎన్సీపీ ముఖ్య అధికార ప్రతినిధి నవాబ్ మాలిక్ స్పష్టం చేశారు. అంతిమంగా మహారాష్ట్ర ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని శివసేన అడుగులు వేస్తే అల్టర్నేట్ మార్గం కనిపిస్తుందని చెప్పడం మరింత ఆసక్తికరంగా మారింది.
వివాహితకు లైంగిక వేధింపులు.. సొంత మరిది టార్చర్.. భరించలేక చివరకు..!
అల్టర్నేట్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తామంటూ..!
ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ ఇదివరకు మాట్లాడుతూ ప్రజా తీర్పును గౌరవిస్తామని.. ఆ మేరకు ప్రతిపక్షంలో కూర్చుంటామని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో శివసేనకు జై కొట్టే విధంగా నవాబ్ మాలిక్ మాట్లాడిన తీరు చర్చానీయాంశమైంది. ఈ నెల 7వ తేదీ నాటికి కొత్త ప్రభుత్వం కొలువుదీరని పక్షంలో రాష్ట్రపతి పాలన తప్పదన్నట్లుగా బీజేపీ నేత సుధీర్ ముంగతివర్ చేసిన ప్రకటన పట్ల నవాబ్ మాలిక్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించడాన్ని అనుమతించే ప్రసక్తి లేదని.. అల్టర్నేట్ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు సిద్ధమని తెలిపారు. ఆ క్రమంలో శివసేనతో పాటు ఇతర పార్టీలు తమ వైఖరి తెలపాలని కోరారు.