యోగిని నోయిడా సెంటిమెంట్ దెబ్బకొడుతుందా?: అదే నిజమైతే..
లక్నో: రాజకీయాల్లో సెంటిమెంట్లను ఫాలో అయ్యే నేతలకు కొదువలేదు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోనూ అంతే. ఇక్కడి ప్రజలు, నాయకుల్లో ఓ బలమైన సెంటిమెంట్ ఉంది. అదేంటంటే.. నోయిడాను సందర్శించే సీఎంలు ఆ తర్వాతి ఎన్నికల్లో ఓడిపోతారని వారు నమ్ముతారు.
1980ల్లో వీర్ బహదూర్ సింగ్ తో మొదలై, ములాయం సింగ్ యాదవ్, మాయావతిలపై నోయిడా సెంటిమెంట్ ఇలాగే పనిచేయడంతో అప్పటినుంచి జనాల్లో అది మరింత బలపడింది. ఇప్పుడు సీఎం యోగి ఆదిత్యనాథ్ విషయంలోనూ అదే జరగబోతుందని అక్కడి ప్రజలు భావిస్తున్నారట.
గత డిసెంబర్ నెలలో సీఎం యోగి గ్రేటర్ నోయిడా, నోయిడా ప్రాంతాల్లో పర్యటించారు. ఆపై జరిగిన గోరఖ్ పూర్, ఫల్పూర్ ఉపఎన్నికల్లో ఓటములు చవిచూశారు. తాజాగా కైరానా ఉపఎన్నికలోనూ యోగి పార్టీని ఓటమి పలకరించడంతో నోయిడా నమ్మకం తెర పైకి వచ్చింది. రాబోయే ఎన్నికల్లో బీజేపీ ఉత్తరప్రదేశ్ లో అధికారం కోల్పోవచ్చునన్న ఊహాగానాలు మొదలయ్యాయి.
ఇక తాజాగా జరిగిన కైరానా లోక్ సభ ఉపఎన్నిక విషయానికొస్తే.. బీజేపీ సిట్టింగ్ అభ్యర్థి కుకుమ్ సింగ్ మరణించడంతో ఇక్కడ మళ్లీ ఎన్నికలు జరిగాయి. కుకుమ్ సింగ్ స్థానంలో బీజేపీ ఆయన కుమార్తెను బరిలోకి దించినా సానుభూతి కరువైంది. విపక్షాల మద్దతుతో ర్ఎల్డీ అభ్యర్థిని తబుస్సుమ్ హసన్ 44,618 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. యూపీ నుంచి ప్రస్తుత లోక్ సభకు ఎన్నికైన తొలి ముస్లిం మహిళగా ఆమె రికార్డు సృష్టించారు.
కైరానాతో పాటు నుర్పూర్ అసెంబ్లీ స్థానాన్ని కూడా బీజేపీ కోల్పోయింది. ఈ పరిణామాలన్ని రాబోయే ఎన్నికల్లో యోగిని అధికారానికి దూరం చేస్తాయన్న వాదన వినిపిస్తోంది. ఉత్తరప్రదేశ్ ప్రజల నోయిడా సెంటిమెంట్ ప్రకారం.. 2003లో అక్కడికి వెళ్లిన ములాయం, ఆపై 2007లో జరిగిన ఎన్నికల్లో ఓడిపోగా, 2011లో నోయిడా ట్రిప్ వేసిన మాయావతి, 2012లో పదవికి దూరమయ్యారు.