బిజెపి ఆఫర్: ప్రియాదత్ పైన ప్రీతి జింటా పోటీ చేస్తారా?
ముంబై: ప్రముఖ బాలీవుడ్ నటి, ఓ ఐపిఎల్ జట్టు యజమాని అయిన ప్రీతి జింటా రానున్నా సార్వత్రిక ఎన్నికలలో పోటీ చేయనున్నారా? సినిమాలు, ఐపిఎల్ తర్వాత ప్రీతి జింటా ఇప్పుడు రాజకీయాలలో తన అదృష్టాన్ని పరిశీలించుకునేందుకు సిద్ధపడుతున్నారా? అనే చర్చ బాలీవుడ్లో చక్కర్లు కొడుతోంది.
సమాచారం మేరకు... రానున్న 2014 సార్వత్రిక ఎన్నికలలో ప్రీతి జింటా పోటీ చేసే అవకాశాలున్నాయట. ప్రీతి జింటా బాలీవుడ్ హీరో సంజయ్ దత్ సోదరి ప్రియా దత్ పైన పోటీ చేయనున్నారట. ప్రియా దత్ పైన పోటీ చేసేందుకు ప్రీతి జింటాకు ప్రధాన ప్రతిపక్షం భారతీయ జనతా పార్టీ నుండి ఆఫర్ వచ్చిందట.
బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి రాజీవ్ ప్రతాప్ రూడీ ఆమెకు ఆఫర్ చేశారట. నార్త్ సెంట్రల్ ముంబై లోకసభ నియోజకవర్గం నుండి రానున్న ఎన్నికల్లో మున్నాభాయ్ సోదరి ప్రియా దత్ పైన పోటీ చేయాలని రూడీ టిక్కెట్ ఆఫర్ చేశారట.
ప్రీతి జింటాకు రాజీవ్ ప్రతాప్ రూడీ దూరపు బంధువు అవుతారని సమాచారం. కాగా, లోకసభ ఎన్నికల్లో కాంగ్రెసు పార్టీ తరఫున పోటీ చేయనున్న ప్రియా దత్ పైన బాలీవుడ్ సెలబ్రటీలనే నిలబెట్టాలని బిజెపి భావిస్తోందట. ఇందులో భాగంగా ప్రీతి జింటాకు టిక్కెట్ ఇస్తామని చెప్పినట్లుగా తెలుస్తోంది.
ప్రీతి జింటా రాజకీయాల్లో తన అదృష్టాన్ని పరిశీలించుకునే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం నేపథ్యంలో... ఆమె నుండి మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన రాలేదు. రాజకీయాల్లోకి వస్తున్నట్లు ఆమె స్వయంగా చెప్పలేదు.