భారత్ నుంచీ ఐసిస్కు ఫండ్స్: బ్యాంక్ లోన్ నుంచి....
న్యూఢిల్లీ: ప్రపంచాన్ని వణికిస్తున్న ఇస్లామిక్ స్టేట్ (ఐసిస్) ఉగ్రవాదులు ప్రపంచవ్యాప్తంగా 40 దేశాల నుంచి నిధులు సేకరిస్తున్నారు. ఇందులో జి20 దేశాలు కూడా ఉన్నాయి. భారత్ నుంచి కూడా ఐసిస్ ఉగ్రవాదులు నిధులు సేకరిస్తున్నారని సమాచారం.
మరో షాకింగ్ విషయం ఏమంటే... బ్యాంకుల నుంచి లోన్లు, ఫైనాన్షియల్ యాక్టివిటీస్ కోసమంటూ ప్రభుత్వ పథకాలను ఇందుకు ఉపయోగించుకుంటున్నారని ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (ఎఫ్ఏటీఎఫ్) తాజా నివేదిక ద్వారా వెల్లడైందని తెలుస్తోంది.
ఆర్థిక అవసరాలు తీర్చుకునేందుకు ఐసిస్ ఉగ్రవాదులు అందుబాటులో ఉన్న అన్ని మార్గాలనూ ఉపయోగించుకుంటున్నారని ఎఫ్ఏటీఎఫ్ తన అక్టోబర్ నివేదికలో వెల్లడించింది. ఫ్రాన్స్ పైన దాడులు జరపడానికి కొద్ది రోజుల ముందు ఎఫ్ఏటీఎఫ్లో సభ్య దేశంగా ఉన్న భారత్కు కూడా ఈ నివేదిక అందింది.
భారత్ నుంచి కూడా ఉగ్రవాదులకు నిధులు అందుతున్నాయని తెలియజేసింది. అవి ఎలా వెళుతున్నాయో కూడా వివరించింది. మొత్తం 50 పేజీలు ఉన్న నివేదికలో... ఉగ్రవాదులు స్వల్పకాలిక రుణాల కోసం బ్యాంకులను సంప్రదిస్తున్నారని తెలిపింది.
అమెరికా, ఫ్రాన్స్, రష్యా తదితర దేశాల నుంచి సైతం వీరికి నిధులు వెళుతున్నాయని ఎఫ్ఏటీఎఫ్ వెల్లడించింది. వారు తమ నిధుల కోసం... సోషల్ మీడియాను, సభ్యులకు మాత్రమే ప్రవేశం ఉండే ఆన్లైన్ ఫోరంలను వినియోగించుకుంటున్నారని తెలిపింది.
డోనర్లను కాంటాక్టు చేసి, వారు డబ్బు పంపేందుకు ఆసక్తిగా ఉన్నారని తెలుసుకున్న తర్వాత ఇంటర్నేషనల్ ప్రీ పెయిడ్ కార్డులు కొనుగోలు చేసి, వాటి ఖాతా సంఖ్యలను స్కైపే వంటి మాధ్యమాల ద్వారా తెలుసుకుంటున్నారని, ఆపై ఆ నంబర్లను, పాస్వర్డ్ను వాడుతూ సిరియాలోని తమ అనుచరులకు డబ్బు పంపుతున్నారని తెలిపింది.
ఉగ్రవాదులు క్రౌడ్ ఫండింగ్ టెక్నిక్లను కూడా వినియోగిస్తున్నారని తెలిపింది. మరోవైపు, పలు దేశాల్లోకి దొంగ కరెన్సీలను చొప్పించడం ద్వారా కూడా ఉగ్రవాదులకు నిధులందుతున్నాయని, ఇందుకు భారత్ ఓ ఉదాహరణని, ముంబైపై ఉగ్రదాడికి ఈ విధానంలోనే... ఫేక్ కరెన్సీ సమకూరిందని ఎఫ్ఏటీఎఫ్ తెలిపింది.