ఇండియా మీద గ్రహాంతరవాసుల దాడి! కేంద్రం వద్ద యాక్షన్ ప్లాన్ ఉందా?
న్యూఢిల్లీ : ఆర్టీఐ.. సమాచార హక్కు చట్టం.. ప్రభుత్వ పనితీరు దగ్గరి నుంచి ప్రతీ విషయం క్షుణ్ణంగా ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో మొదలైన చట్టం ఇది. ప్రభుత్వ పరిధిలోని ఎలాంటి సమాచారమైనా.. దీని ద్వారా తెలుసుకునే వెసులుబాటు ఉంది. అయితే దీన్ని సమర్థంగా ఉపయోగించుకుని ప్రభుత్వ లోపాలను ఎత్తి చూపేవారు కొందరైతే.. కేవలం ప్రభుత్వానికి విసుగు తెప్పించడానికేనా అన్నట్లు ఇష్టం వచ్చిన ప్రశ్నలతో ఆర్టీఐకి దరఖాస్తు పెట్టుకునే వాళ్లు మరికొందరు?
తాజాగా ముంబైకి చెందిన అజయ్ కుమార్ అనే ఓ వ్యక్తి ఆర్టీఐకి ఓ వింత దరఖాస్తు పెట్టుకోవడంతో ఈ విషయం చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ అతని పెట్టుకున్న దరఖాస్తు దేనికి సంబంధించిందంటే.. 'ఇప్పటికిప్పుడు గ్రహాంతరవాసులు, జాంబీలు, మానవాతీత శక్తులు దేశం మీద దాడి చేస్తే.. దానిని మోడీ ప్రభుత్వం ఎలా ఎదుర్కొంటుంది?' దీనిపై కేంద్ర హోంమంత్రిత్వ శాఖ తనకు వివరణ ఇవ్వాలని కోరుతూ ఆర్టీఐ చట్టం కింద దరఖాస్తు చేసుకున్నాడు.
Dude files RTI request about whether Indian govt. can handle a zombie outbreak. Included my favourite part of request. pic.twitter.com/BVty8FIPQH
— Abhimanyu Ghoshal (@aghoshal) September 20, 2016
దరఖాస్తులో ప్రభుత్వానికి ఓ సలహా కూడా ఇచ్చాడు అజయ్. 1996లో సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో హాలీవుడ్ లో వచ్చిన ఇండిపెండెన్స్ డే సినిమా గురించి ప్రస్తావిస్తూ.. 'విల్ స్మిత్ లేకుండా ఇండియా గ్రహాంతరవాసులను ఎదుర్కోగలదా? ఇందుకోసం విల్ స్మిత్ సహాయం తీసుకోవాలంటూ' సలహా ఇచ్చాడు. ఆ సినిమాలో విల్ స్మిత్ గ్రహాంతరవాసులను సమర్థంగా ఎదుర్కొని ఓడించిన సంగతి తెలిసిందే.
ప్రముఖ జర్నలిస్ట్ అభిమన్యు ఘోషల్.. ఆర్టీఐకి అజయ్ దరఖాస్తు చేసుకున్న ప్రశ్న కాపీని తన ట్విట్టర్ లో పోస్ట్ చేయడంతో ఈ విషయం వెల్లడయింది. దీంతో ఈ విషయం కాస్త అందరి నోటా హాట్ టాపిక్ గా మారింది.