ఈవీఎంల రిగ్గింగులో ప్రమేయం ఉందా? సుప్రీంకోర్టుపై కాంగ్రెస్ నేత వివాదాస్పద వ్యాఖ్యలు
ఢిల్లీ : వీవీప్యాట్ స్లిప్పుల లెక్కింపు కేసులో సుప్రీంకోర్టు వైఖరిని తప్పుబడుతూ కాంగ్రెస్ నేత వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వందశాతం వీవీప్యాట్ స్లిప్పులను లెక్కించాలన్న పిల్ను అత్యున్నత న్యాయస్థానం తోసిపుచ్చడంపై వాయువ్య ఢిల్లీ మాజీ ఎంపీ ఉదిత్ రాజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విపక్షాల డిమాండ్ను సుప్రీంకోర్టు ఎందుకు పట్టించుకోవడంలేదన్న ఆయన.. రిగ్గింగ్లో కోర్టు సైతం పాలుపంచుకుందా అని ప్రశ్నించారు.
హవ్వా .. బాలుడితో ఈవీఎం మోయిస్తారా : ఈసీపై తేజస్వి గుస్సా
మూడు నెలలుగా కొనసాగుతున్న ఎన్నికల ప్రక్రియతో పాలన అటకెక్కిందన్న విషయం సుప్రీంకోర్టు మర్చిపోయిందని ఉదిత్ రాజ్ అభిప్రాయపడ్డారు. మరో రెండు ముడ్రోజులు ఓట్ల లెక్కింపులో జాప్యాన్ని ఎందుకు తీవ్రంగా పరిగణిస్తున్నారని సర్వోన్నత న్యాయస్థానాన్ని ప్రశ్నిస్తూ ఆయన ట్వీట్ చేశారు. లెక్కించే వీవీ ప్యాట్ స్లిప్పుల సంఖ్యను పెంచాలని కోరుతూ 22 పార్టీలు సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే.. ఓట్ల లెక్కింపులో జాప్యం చేసుకుంటుందని న్యాయస్థానం తిరస్కరించడాన్ని ఉదిత్ రాజ్ తప్పుబట్టారు.
మూడు నెలల పాటు సాగిన ఎన్నికల ప్రక్రియతో అభివృద్ధి పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయని ఉదిత్ రాజ్ విమర్శించారు. స్లిప్పుల లెక్కింపునకు మరో ఒకట్రెండు రోజులు సమయంపడితే ఏమవుతుందని ప్రశ్నించారు. తాను సుప్రీంకోర్టుపై ఎలాంటి ఆరోపణలు చేయడంలేదని, తన ఆందోళనను మాత్రమే వెలిబుచ్చుతున్నానని స్పష్టం చేశారు.