హిందూ యువతిని పెళ్లాడనున్న జామా మసీదు జూ. ఇమామ్?
న్యూఢిల్లీ: దేశ రాజధానిలోని ప్రతిష్ఠాత్మక జామా మసీదు షాహి ఇమామ్ సయ్యద్ అహ్మద్ బుఖారీ కుమారుడు, జూనియర్ ఇమామ్ షబాన్ బుఖారీ ఓ హిందూ యువతిని వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.
వీరిద్దరి మధ్యా గత రెండేళ్లుగా ప్రేమ వ్యవహారం నడుస్తుండగా, తొలుత వివాహానికి అంగీకరించని షబాన్ తండ్రి... ఆ అమ్మాయి ముస్లిం మతం స్వీకరిస్తుందని, ప్రస్తుతం ఖురాన్ నేర్చుకుంటున్నదని తెలిసి అంగీకారాన్ని తెలిపారనే వార్తలు వినబడుతున్నాయి.
ఈ యువతి ఎవరన్న విషయం ఇంకా బయటకు పొక్కనప్పటికీ, నవంబర్ 13న వివాహం నిశ్చయమైందని పలు జాతీయ పత్రికలు వార్తలను ప్రచురించాయి. అమిటీ యూనివర్శిటీ నుంచి గ్రాడ్యుయేషన్ పొందిన షబాన్ను గత సంవత్సరం నవంబర్లో జామా మసీదు నయీబ్ ఇమాన్గా ప్రకటించారు.
అంటే, దేశంలోని అతిపెద్ద మసీదైన జామా మసీదుకు అతని తండ్రి తర్వాత ప్రధాన ఇమామ్గా ఆయనపై బాధ్యతలు పడతాయి. ఇదిలా ఉంచితే, ఈ వార్తలన్నీ అవాస్తవాలని, యూపీలో పంచాయతీ ఎన్నికలు జరగనున్న వేళ షాహీ ఇమామ్, ఆయన కుటుంబ పరువు తీసేందుకు ఈ తరహా వార్తలు కల్పిస్తున్నారని జామా మసీద్ ఆఫీస్ ఇంఛార్జ్ అమానుల్లా వ్యాఖ్యానించారు.
కాగా, ఈ ప్రేమికుల వివాహ వార్తలను సోషల్ మీడియా ద్వారా కొందరు స్వాగతిస్తుండగా, మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. మతం మార్చి వివాహం చేసుకోవడం సరికాదని అంటున్నారు. మతాలు వేరైనా వివాహం చేసుకోవాచ్చని, వారి వారి మతాచారాలను వివాహమైన తర్వాత కూడా కొనసాగించేలా చూసుకోవాలని మరికొందరు ఆకాంక్షిస్తున్నారు.