భారత కొత్త ఉపరాష్ట్రపతి ఈయనే!?: లోక్ సభలో ఫైరింగ్ స్పీచులకు కేరాఫ్!
బీహార్ లో మధుబణి నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న హుకుందేవ్ నారాయణ్ యాదవ్ గతంలో కేంద్ర మంత్రిగాను పనిచేశారు.
న్యూఢిల్లీ: రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పదవీకాలం వచ్చే జూలైతో ముగియనుండటంతో ఆయన స్థానంలో బీజేపీ సీనియర్ నేత ఎల్.కె అద్వానీకి దాదాపుగా స్థానం ఖరారైపోయినట్లే అని ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇక ఉపరాష్ట్రపతి పదవి కోసం 'హుకుందేవ్ నారాయణ్ యాదవ్' పేరును బీజేపీ పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తోంది.
మోడీపై 'గురుదక్షిణ' ఒత్తిడి: రాష్ట్రపతిగా అద్వానీ?
ప్రస్తుత ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ పదవీ కాలం ఈ ఏడాదితో ముగియనుండటంతో ఉపరాష్ట్రపతి పదవికి సరైన వ్యక్తులను వెతికే పనిలో బీజేపీ నిమగ్నమైంది. ఈ నేపథ్యంలోనే హకుందేవ్ నారాయణ్ యాదవ్ పేరు తెరపైకి వచ్చింది. హమీద్ అన్సారీ పదవిని ఇప్పటికే ఓ ఏడాది పాటు పొడగించిన బీజేపీ.. ఇక ఆయన స్థానంలో కొత్తవారికి అవకాశం కల్పించాలని యోచిస్తోంది.
కాగా, బీహార్ లో మధుబణి నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న హుకుందేవ్ నారాయణ్ యాదవ్ గతంలో కేంద్ర మంత్రిగాను పనిచేశారు. బీహార్ సీఎం నితీష్ కుమార్ కూడా 'యాదవ్' సామాజిక వర్గానికే చెందినవారే కావడం హుకుందేవ్ కు కలిసొచ్చే అంశం.
పేదల వ్యతిరేక పార్టీగా బీజేపీపై విమర్శలు వస్తున్న తరుణంలో హుకుందేవ్ ను ఉపరాష్ట్రపతిగా ఎంపిక చేయడం పార్టీకి లాభిస్తుందన్న యోచనలో మోడీ సహా పలువురు పార్టీ అగ్రనాయకులు ఉన్నట్లు సమాచారం.
లోక్ సభ లో ఫైరింగ్ స్పీచులకు హుకుందేవ్ ను కేరాఫ్గా చెబుతారు. బీజేపీపై విపక్షాల ఆరోపణలను చాలాసార్లు సమర్థవంతంగా తిప్పికొట్టి ప్రధాని మోడీ మెప్పు పొందారు. 1993లో బీజేపీలో చేరిన హుకుందేవ్ పార్టీ తరుపున పలు పదవులు అధిష్టించారు. వాజ్ పేయి ప్రభుత్వంలోను పలు పదవులు చేపట్టారు. అగ్రికల్చర్, ట్రాన్స్ పోర్ట్, షిప్పింగ్ విభాగాల్లో పదవులు చేపట్టిన అనుభవం ఉంది.